పోలవరం పునరావాస ప్యాకేజీ ఇవ్వండి

–  రాష్ట్రానికి 77 వేల టన్నుల బియ్యం ఇవ్వాలి
– ప్రధాని మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ వినతి
న్యూఢిల్లీ : పోలవరం నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ కేంద్రం ఇవ్వాలని, పోలవరం అంచనా వ్యయం రూ. 55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ‘పోలవరం తొలిదశలో భాగంగా మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. ఇది ఇస్తేనే తొలిదశ పూర్తి అవుతుంది. కనుక మొత్తం పోలవరం తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు ఇవ్వాలి’ అని ప్రధానిని కోరారు. ప్రధానితో దాదాపు ఒక గంట 20 నిమిషాల పాటు ముఖ్యమంత్రి భేటీ సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానితో సమావేశానికి ముందు కేంద్రం హోంమంత్రి అమిత్‌ షాతో దాదాపు 45 నిమిషాలు పాటు వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ప్రధానితో సమావేశం తరువాత కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆయన కలిశారు. అయితే ఈ భేటీల అనంతరం పాత డిమాండ్లతో కూడిన ప్రకటననే ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.
రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని, సుదీర్ఘకాలంగా ఇది పెండింగ్‌లో ఉందని ప్రధానమంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరం అవుతుందని, ఇది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని తెలిపారు. పోలవరం తొలిదశ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే రూ.12,911.15 కోట్ల మంజూరుకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిందని అన్నారు. అయితే తొలిదశలో మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని, ఇది ఇస్తేనే తొలిదశ పూర్తైనట్టని ప్రధాని మోడీకి జగన్‌ వివరించారు. ఈమేరకు జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.1,310.15 కోట్లను వెంటనే రీయింబర్స్‌ చేయాలని కోరారు.
రాష్ట్రానికి బియ్యం ఇవ్వాలి
జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత లోపించిన విషయాన్ని మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రేషన్‌ దక్కకుండా పోతోందని, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.5,527 కోట్ల భారం పడుతోందని, సత్వరమే జోక్యంచేసుకోవాలని కోరారు.