కరోనా మహమ్మారి దెబ్బ నుంచి ప్రపంచం కోలు కోవాలి అన్న ఆశాభావం ఎంతగా వెల్లడవుతున్నా అందుకు అనుగుణంగా ప్రపంచ పరిణామాలు లేవు. తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వెల్లడించిన ప్రపంచ ఆర్థిక ధృక్కోణం రానున్న రోజుల్లో ప్రపంచ ప్రగతి మరింత దిగజారనుందని జోస్యం చెప్పింది. ఇతరత్రా అనేక మంది ఆర్థికవేత్తల విశ్లేషణలు, దేశాలు, ప్రాంతాల పని తీరును చూసినా అధోగతి తప్ప పురోగతి కనుచూపు మేరలో కనిపించటం లేదు. గతేడాది ప్రపంచ వృద్ధి రేటు 3.5 శాతం ఉండగా వర్తమానంలో మూడు, వచ్చే ఏడాది 2.9 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ చెప్పింది. రెండు వేల నుంచి 2019 వరకు సగటు వృద్ధి రేటు 3.8శాతం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఐరోపాలో పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న జర్మనీ పురోగమనం సంగతి దేవుడెరుగు తిరోగమనంలోకి దిగజారుతుందా అన్న భయాలు ఉన్నాయి. ఇప్పటికే అది రోగిగా మారినట్లు వర్ణిస్తున్నారు. ధనిక దేశాల వృద్ధి రేటు గతేడాది 2.6శాతం ఉండగా ప్రస్తుత ఏడాదిలో 1.5, వచ్చే ఏడాది 1.4 శాతానికి దిగజారుతుందని, అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి రేటు 4.1 నుంచి నాలుగు శాతానికి తగ్గుతుందని అంచనా. ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే ఉంటే అన్న ప్రాతిపదిక మీద చెప్పిన మాటలు. ఉక్రెయిన్ సంక్షోభం కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ఐఎంఎఫ్ తాజా అంచనాలను రూపొందించే సమయానికి ఇజ్రాయిల్ – పాలస్తీనా సంక్షోభం ఊహలో కూడా లేదు. అమెరికా తన ఆయుధ పరిశ్రమలకు లాభాలను సమకూర్చేందుకు ప్రపంచంలో ఎప్పుడు ఏ మూలన చిచ్చుపెడుతుందో, అది అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పలేము. ఇటువంటి స్థితిలో ఎగుమతుల మీద ఆశలు పెట్టుకున్న మన వంటి దేశాల పరిస్థితి అగమ్యగోచరం, దిగుమతులతో వాణిజ్య లోటు పెరుగుతుంది అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఎగు మతుల్లో మిగులు ఉన్న చైనాకు వాణిజ్య మిగులు తగ్గ వచ్చు తప్ప ఇప్పటికిప్పుడు లోటులో పడే అవకాశం లేదు.
పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా తన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అమెరికా తీసుకుంటున్న చర్యలు యావత్ ప్రపంచాన్ని ప్రతి కూలంగా ప్రభావితం చేస్తున్నాయి. వడ్డీరేటును పెంచటం తో ప్రపంచంలో ఉన్న డాలర్లన్నీ అమెరికాకు పయనం కట్టటం, దాని విలువ పెరగటంతో అనేక దేశాల కరెన్సీల విలువ పతనమౌ తున్నది. అది కష్టజీవుల మీద ఎన లేని భారాన్ని మోపుతున్నది. 2022లో 8.7శాతంగా ఉన్న ప్రపంచ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ 2024లో 5.8 ఉంటుందని అంచనా. ఇదేమీ తక్కువ కాదు. రెండు శాతా నికి పరిమితం చేయాలన్న ప్రపంచ ద్రవ్యోల్బణ లక్ష్యం ఎప్పటికి నేరవేరుతుంది అన్నది ప్రశ్నే. మనదేశంతో సహా అనేక దేశాలు తీవ్రమైన లోటును ఎదుర్కొంటున్నాయి. అమెరికా విత్తలోటు 8 నుంచి వచ్చే ఏడాదికి 7.4శాతానికి, ఐరోపాలో 3.4 నుంచి 2.7 శాతానికి తగ్గుతుందని చెబు తున్నారు. మరోసారి ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుల సూచనలు కనిపిస్తున్నాయి. ఎగుమతి దేశాలు తమను తాము కాపాడుకునేందుకు ఉత్పత్తి, సరఫరాను తగ్గించాలన్న నిర్ణయం దిగుమతి దేశాలకు ఆశనిపాతమే. ఒకవైపు రష్యా ఇంధన ఎగుమతులపై అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించి దాన్ని దెబ్బతీయాలని చూస్తు న్నాయి. రష్యా నుంచి ఐరోపాకు ఇంధన సరఫరా చేసే పైప్లైన్లను ధ్వంసం చేయించింది అమెరికాయే అనే వాస్త వాలు వెల్లడయ్యాయి. ఉక్రెయిన్ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని తన ఇంధనాన్ని ఎక్కువ ధరలకు ఐరోపాకు అంట గట్టేందుకు చేసిన కుట్ర ఇదని చెబుతున్నారు. తనను నమ్మిన దేశాలకే అమెరికా పంగనామాలు పెడు తోంది. ఇప్పటికే ఐరోపా దేశాలు ఇంధన ధరల పెరుగుదలతో సతమతమౌతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎంత మేరకు తట్టుకోగలవు అన్నది ప్రశ్న. అంతిమంగా కార్మికవర్గం మీదనే ఆ భారాలు మోపుతారన్నది వేరే చెప్పనవసరం లేదు.
ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లుగా పెరిగిన ద్రవ్యోల్బణం గృహస్తుల పొదుపు ఇప్పటికే హరిం చింది. ఒత్తిడి తీవ్రత తగ్గింది తప్ప దాని పర్యవ సానాలైన పెరిగిన రుణభారం, ఇతర వ్యవస్థాగత ప్రతికూలతలు ఇంకా అలాగే ఉన్నాయి. ప్రపంచ మంతటా వాణిజ్య విశ్వాస సూచిక దిగువ చూపులు చూస్తున్నది. గిరాకీ తగ్గుతున్నది, ఆ మేరకు ఉత్పత్తిని తగ్గిస్తే నిరుద్యోగం తీవ్రత పెరు గుతుంది. అది గిరాకీని మరింతగా తగ్గిస్తుంది. అలాంటపుడు కోలుకోవటం ఎలా అన్నది ప్రశ్న. తాజా ప్రపంచ ఆర్థిక దృక్కోణ నివేదిక వెల్ల డించిన అంశాలు పరిస్థితి మరింగా దిగజారటాన్నే సూచిస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం.