జీఓ 5ని వెంటనే ఉపసంహరించుకోవాలి

– ఐటీ పరిశ్రమలో కార్మిక చట్టాల సడలింపు సరికాదు
– తెలంగాణ మీ సేవ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్‌
– మంత్రి దుద్దిళ శ్రీధర్‌బాబుకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలోని ఐటీ పరిశ్రమల్లో కార్మిక చట్టాలను మరో నాలుగేండ్ల పాటు సడలిస్తూ కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన జీవో నెంబర్‌ 5ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ మీ సేవ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఆ జీవో వల్ల ఐటీరంగంలో పనిచేస్తున్న కార్మికులకు నష్టం చేకూరే ప్రమాదముందని జె.వెంకటేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్లుగా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలో కార్మిక శాఖ తనిఖీలు చేయడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కరోనా కాలం తర్వాత ఐటీ రంగంలో ఉన్న సౌకర్యాలను తగ్గించారనీ, వేతనాల్లో కోతపెట్టడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కార్మిక చట్టాలు ఆ రంగంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ మీ సేవ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.సురేశ్‌, ప్రధాన కార్యదర్శి జెనీమా, కోశాధికారి ఎవీబీ లక్ష్మి, సహాయ కార్యదర్శి కవిత, ఉపాధ్యక్షులు బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.