హజ్‌యాత్రకు వెళ్లి…

హజ్‌యాత్రకు వెళ్లి...– ఇప్పటి వరకూ 550 మంది మృతి
– చనిపోయిన వారిలో ఈజిప్ట్‌, జోర్డాన్‌ దేశస్తులే అధికం
– సుమారు 323 మంది ఈజిప్షియన్లు, 60 మంది జోర్డానియన్ల్లు కన్నుమూత
రియాద్‌: హజ్‌ యాత్రకు వెళ్లి పలువురు కన్నుమూశారు. అధిక ఉష్ణోగ్రతలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ వేడిమిని తాళలేక 550 మందికిపైగా మృతి చెందారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. చనిపోయిన వారిలో ఈజిప్ట్‌, జోర్డాన్‌ దేశస్తులే అధికంగా ఉన్నారు. సుమారు 323 మంది ఈజిప్షియన్లు, 60 మంది జోర్డానియన్లు మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 577కి చేరినట్టు తెలుస్తోంది. వీరంతా వేడి సంబంధిత సమస్యలతోనే మరణించినట్టు సమాచారం. వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నా భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. మక్కాలోని అతిపెద్ద ఆస్పత్రుల్లో ఒకటైన అల్‌-ముయిసెమ్‌ ఆస్పత్రి మార్చురీలో మొత్తం 550 మృతదేహాలు ఉన్నట్టు దౌత్యవేత్తలు తెలిపారు. వేడి సంబంధిత సమస్యలు ఉన్న సుమారు 2,000 మంది యాత్రికులకు చికిత్స అందించినట్టు సౌదీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మక్కాలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మక్కాలోని గ్రాండ్‌ మసీదు వద్ద సోమవారం 51.8 డిగ్రీల సెల్సియస్‌ (125 ఫారెన్‌హీట్‌) ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో హజ్‌ యాత్రకు వెళ్లిన భక్తుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రతి దశాబ్దం సౌదీ అరేబియాలో 0.4 డిగ్రీల వేడి పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఈ హజ్‌ యాత్ర ఈనెల 19వ తేదీ (బుధవారం)తో ముగిసింది. ఈ సారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్‌ నిర్వాహకులు వెల్లడించారు. ఎండ తాపాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహకులు అనేక ఏర్పాట్లు చేశారు. యాత్రికులు గొడుగులు వాడాలని, ఎప్పటికప్పుడు నీరు తాగాలని సూచించారు. వారిపై నీళ్లు చిలకరించేలా వాలంటీర్లను నియమించారు.
హజ్‌ యాత్రతో సౌదీకి భారీ ఆదాయం
హజ్‌యాత్ర ద్వారా సౌదీ అరేబియా ఏడాదికి 12 బిలియన్‌ డాలర్లు ఆర్జిస్తుంది. విజన్‌ 2030 రూట్‌మ్యాప్‌లో భాగంగా సౌదీ అరేబియా 2030 నాటికి హజ్‌, ఉమ్రా రెండింటి ద్వారా మత పరమైన పర్యాటకుల సంఖ్యను 30 మిలియన్లకు పెంచాలని సౌదీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ యాత్రలు చేసే పర్యాటకులు ఆహారం, ప్రయా ణం, వసతి, ఇతర వాటికి వెచ్చించే నగదుతో ఆ దేశ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతోంది. కాగా, హజ్‌ ఖర్చు ఒక వ్యక్తికి 3వేల డాలర్ల నుంచి 10వేల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా.