గంగాధర గడ్డపై గోదారమ్మ పరవళ్ళు

– ఫలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రయత్నం
– నెలరోజుల వ్యవధిలో నారాయణపూర్ కు రెండవసారి నీటి విడుదల 
– పంటల చివరి మడి వరకు సాగునీరు అందిస్తామన్న మేడిపల్లి
నవతెలంగాణ – గంగాధర 
గంగాధర గడ్డపై గోదారమ్మ పరవళ్ళు తొక్కుతోంది. పంటల చివరి మడి వరకు నీరందించాలనే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రయత్నం సఫలమైంది. ముదిరిన ఎండలను చూస్తూ ఆందోళన చెందుతున్న రైతాంగానికి నేనున్నాననే భరోసా కల్పిస్తూ ఎల్లంపల్లి జలాలను ఎత్తిపోతల ద్వారా నెల రోజుల వ్యవధిలో రెండవసారి గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు ఆదివారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. దీంతో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ జలాశయంలోకి నీరు చేరుతుండజంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. గత పదేళ్లుగా కరువు నేలలో జలసిరులు గలగల పారుతుంటే పంటల దిగుబడి అధికమవుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎత్తిపోతలతో ప్రాజెక్టులు నింపకుండా నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించకుండా రైతులతో కలిసి గత 10 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తూ వచ్చారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్న మేడిపల్లి చొప్పదండి నియెాజక వర్గంలోని ప్రతి పల్లెకు  సాగునీరు అందాలనే సంకల్పంతో భగీరథ ప్రయత్నం చేసి నారాయణపూర్ జలాశయం నింపడానికి చేసిన కృషి పట్ల రైతాంగంలో సంతోషాన్ని నింపింది. రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా చివరి మడి వరకు  సాగునీరు అందిస్తామన్న మాటను ఎమ్మెల్యే సత్యం నిలబెట్టుకుని  నిజాయితీని నిల బెట్టుకున్నారు. సాగు చేసిన వరి పొలాలు ప్రస్తుతం పొట్ట దశలో ఉండగా, పంటలకు జీవం పోసేలా తీసుకున్న చొరవ అన్నదాతలో ఆనందం నింపింది. ప్రతిపక్షాల  అబద్ధపు ప్రచారాన్ని నమ్మి అన్నదాతలు  ఆందోళన చెందవద్దని,  రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానంటూ  మేడిపల్లి రైతులకు భరోసా కల్పించారు. సాగు చేసిన పంటలు ఎండిపోకుండా సకాలంలో రిజర్వాయర్ కు నీటిని  విడుదల చేయించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు   రైతులు కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు.