శ్రీజ, మనిక శుభారంభం

శ్రీజ, మనిక శుభారంభం– ఐటీటీఎఫ్‌ ప్రపంచకప్‌ 2024
మకావు (చైనా) : ఐటీటీఎఫ్‌ టేబుల్‌ టెన్నిస్‌ ప్రపంచకప్‌లో తెలుగు తేజం ఆకుల శ్రీజ, భారత స్టార్‌ ప్యాడ్లర్‌ మనిక బత్రా శుభారంభం చేశారు. మహిళల గ్రూప్‌ దశ మ్యాచుల్లో తొలి గేమ్‌లోనే విజయం సాధించి ఆకట్టుకున్నారు. వరల్డ్‌ నం.39 ఆకుల శ్రీజ 4-0తో పొలాండ్‌ అమ్మాయిపై ఘన విజయం సాధించింది. 11-9, 11-6, 11-5, 11-5తో వరుస సెట్లలో గెలుపొందింది. వరల్డ్‌ నం.37 మనిక బత్రా 3-1తో గెలుపొందింది. రోమానియా ప్యాడ్లర్‌కు తొలి సెట్‌ 9-11తో కోల్పోయిన మనిక తర్వాతి సెట్లలో వరుసగా 11-8, 11-6, 11-8తో ఆకట్టుకుంది. గ్రూప్‌ దశ తర్వాతి మ్యాచ్‌లో వరల్డ్‌ నం.2 వాంగ్‌ (చైనా)తో మనిక తలపడనుంది. ఆకుల శ్రీజ తర్వాతి మ్యాచ్‌లో వరల్డ్‌ నం.4 చెన్‌ మెంగ్‌ (చైనా)ను ఢకొీట్టనుంది. ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో మహిళలు, పురుషుల విభాగాల్లో మొత్తం 16 గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూప్‌ నుంచి అగ్రస్థానంలో నిలిచిన ప్యాడ్లర్‌ నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తారు.