వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సహాయం అందాలి: తుమ్మల

Every flood-affected farmer should get government help: Thummalaనవతెలంగాణ – అశ్వారావుపేట
ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరియు ఐటిడిఏ పిఓ రాహుల్  తో కలిసి అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టు గండి ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం గుమ్మడి వల్లి గ్రామంలో వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి, అక్కడ ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని బరోసా ఇచ్చారు. మండలంలో వరద తాకిడి వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అనంతరం అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి ప్రాజెక్ట్ అతిథి గృహం ప్రాంగణంలో గల   గిరిజన మహిళా డిగ్రీ కళాశాల భోజన శాలలో నీటిపారుదల, రహదారులు భవనము లు,పంచాయితీ రాజ్,విద్యుత్,ఐటిడిఏ శాఖల ఇంజనీరింగ్ విభాగాలు అధికారులు,రెవిన్యూ,పంచాయితీ,వైద్యం,పోలీస్ శాఖ అధికారుల తో వరద వల్ల జరిగిన పంట నష్టం,అనంతరం తీసుకో వలసిన పునరావాస సౌకర్యాలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందు గా నీటి పారుదల శాఖ సీ.ఈ ఏ.శ్రీనివాసరెడ్డి,ఇతర అధికారులను గండి పడటానికి గల కారణాలను,వారు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.ఇరిగేషన్ ఈ ఈ ని ప్రాజెక్టుని ఎప్పుడూ తనిఖీ చేశారు అని ప్రశ్నించగా జూన్ నెలలో చేశామని సమాధానం ఇచ్చారు.జులైలో ఎందుకు నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.వరదను ముందుగా అంచనా వేసి గేట్లను తెరిచి ఉంటే నష్టం జరిగేది కాదని తెలిపారు.ప్రాజెక్టు గండి పడటానికి గల కారణాలను సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్ జితేష్ వి.పాటీల్ ను కోరారు. రెవెన్యూ శాఖ పరంగా కొత్తగూడెం ఆర్డీఓ మధు బాబు ను వరదలు అనంతరం తీసుకున్న చర్యలు పై వివరణ అడగగా ఆయన మాట్లాడుతూ.. వరదకు గురి అయిన గుమ్మడవల్లి,కొత్తూరు, అనంతారం గ్రామాలలోని 70 కుటుంబాలకు చెందిన 250 మందికి పునరావాసం  కల్పించామని తెలిపారు. కుటుంబానికి పది కేజీల బియ్యం,కందిపప్పు మంచి నూనె ప్యాకెట్,కూరగాయలు ఆదివారం సాయంత్రం లోపల అందజేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి మండలంలోని అన్ని గ్రామాలలో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని,బ్లీచింగ్, ఫాగింగ్  మరియు శానిటేషన్,సురక్షిత మంచినీరు  అందించాలని. వరదల అనంతరం అంటు వ్యాధులు ప్రబలకుండా  పరిశుభ్రత పాటించాలని మంత్రి ఆదేశించారు.
విద్యుత్ శాఖ ఎస్.ఈ బీకాం సింగ్ మాట్లాడుతూ అన్ని గ్రామాలలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ లు,విద్యుత్ సరఫరా  పునరుద్ధరించాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ అధికారులతో  మాట్లాడుతూ వరదల అనంతరం  గ్రామాలలో ప్రజలు  విష జ్వరాల బారిన పడతారని,ప్రతి గ్రామంలో ఏఎన్ఎం లు,అంగన్వాడి ఆశాలు తో ఇంటింటికి సర్వే చేయించి ప్రజల ఆరోగ్యాలు తెలుసుకోవాలని ప్రజల ఆరోగ్యం బాధ్యత ప్రభుత్వ వైద్యుల దేనని,అదనంగా సిబ్బంది,వాహనం అవసరమైతే జిల్లా కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపాలని ప్రజల ఆరోగ్యం పట్ల ఎటువంటిది నిర్లక్ష్యం వహించ రాదని హెచ్చరించారు. వైద్య మరియు పంచాయతీ శాఖ సమన్వయంతో అంటువ్యాధులు  ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  పంచాయతీ రాజ్ డీ.ఈ శ్రీనివాసరావు, రోడ్లు భవనాలు శాఖ ఈ.ఈ వి.వెంకటేశ్వరరావు తో  మాట్లాడుతూ వరద వల్ల తెగిపోయిన రోడ్లు,ఓవర్ బ్రిడ్జి లు వద్ద జరిగిన డ్యామేజి కి ముందుగా  గ్రావెల్ పోసి ప్రజా రావాణా కి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. వర్షాలు తగ్గాక శాశ్వత ప్రాతిపదికన రోడ్డు రిపేరు చేయొచ్చు అన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో శిథిలావస్థలో వున్న భవనాలు గుర్తించి వెంటనే అట్టి భవనాలను  కూల్చి వేయాలన్నారు. ప్రత్యామ్నాయంగా వాటి స్థానంలో తాత్కాలికంగా షెడ్లు లేదా వేరే భవనంలోని కి పాఠశాలలు  మార్చాలని  విద్యార్థులకు రక్షణ కల్పించాలన్నారు. వ్యవసాయ,ఉద్యానవన శాఖ అధికారులు బాబూరావు,సూర్యనారాయణ లో మంత్రి మాట్లాడుతూ వరద వల్ల అశ్వారావుపేట మండలంలోని వరి పొలాలు ఎంత మేరకు నష్టపోయాయో సర్వే సిద్ధం చేయాలన్నారు, పత్తి పొలాలకు,ఆయిల్ ఫామ్ తోటలలో  ఎంతవరకు ఎంత మేరకు ఇసుక మేటలు పేరుకు పోయాయో తనిఖీ చేయాలన్నారు.నష్టపోయిన రైతులు తదుపరి  ఏ పంట వేయాలి అనుకున్నారో తెలుసుకుని వారికి తగిన విత్తనాలు అందజేయాలన్నారు.
నష్టపోయిన రైతులు అందరికీ సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పూర్తి నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ కి సమర్పిస్తే అట్టి నివేదికలను ప్రభుత్వానికి పంపి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతు కి ప్రభుత్వ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అశ్వారావుపేట పోలీసు సీఐ కరుణాకర్  తో మాట్లాడుతూ సిబ్బంది ప్రతి గ్రామానికి వెళ్లి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని జిల్లా కలెక్టర్,ఎస్పీ లకు తెలియజేయాలని,విధి నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించ రాదని,వర్షాకాలం పూర్తి అయ్యేవరకు జిల్లా యంత్రాంగం అందరూ తమ తమ కార్య స్థానంలో ఉండి చిత్తశుద్ధితో పని చేయాలని ఆదేశించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పెద్దవాగు ఘటన చాలా బాధాకరమని దీనివల్ల చాలా ఆస్తి నష్టం తో పాటు గ్రామాల్లో పేదలు చాలా ఇబ్బందికర పరిస్థితులను  తెలిపారు. అదృష్టవశాత్తు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల ఏ ఒక్క ప్రాణ హాని జరగకుండా చూడగలిగామని,ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులు అందరిని ప్రభుత్వం అన్ని విధాలుగా మంత్రి తెలిపారు. కొత్తూరు గ్రామంలో విద్యుత్ ఘాతుకం తో మృతి చెందిన వేణు మురళి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. పెద్దవాగు ఉమ్మడి రాష్ట్రానికి చెందినది కాబట్టి రెండు రాష్ట్రాలు నిధులు ఇవ్వాలని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే సీజన్లో ఇప్పుడు ఉన్న వరద కు తగ్గట్టుగా పటిష్టమైన డిజైన్ తో శాశ్వత ప్రాతిపాదికన ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని మూడు గేట్లు అదనంగా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సెలవుల పై వెళ్లరాదని, అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్,ఎస్పీ రోహిత్ రాజు,ఐటీడీఏ పీఓ రాహుల్,పాల్వంచ డిఎస్.పి సతీష్ కుమార్, సీఐ కరుణాకర్, ఎస్.ఐ శివరామ్ క్రిష్ణ,తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,ఏడీఏ అఫ్జల్ బేగం,ఆయిల్ ఫెడ్ డీఓ ఏ.బాలక్రిష్ణ, డాక్టర్ మధుళిక,ఆయిల్ ఫెడ్ బోర్డ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ ఆలపాటి రామచంద్ర ప్రసాద్,డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు,మొగళ్ళపు చెన్నకేశవ రావు, సుంకవల్లి వీరభద్రరావు,బండి భాస్కర్, జ్యేష్ట సత్యనారాయణ చౌదరి లు పాల్గొన్నారు.