జిల్లాలో విస్తరిస్తున్న విషజ్వరాలు డెంగ్యూ వ్యాధులపై ప్రజలకు అవసరమైన చికిత్స లు ప్రభుత్వం తక్షణమే అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకట గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికున్గున్యాతో పాటు, విషజ్వరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో కుటుంబాలకు కుటుంబాలే మంచానపడుతున్నాయి. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా వున్నది. ముఖ్యంగా గ్రామపంచాయితీల్లో సరిపడా గ్రామ పంచాయతీ వర్కర్స్ లేక పోవడం వల్ల పారిశుద్ధ్యం లోపించడం వల్ల పరిస్తితి ఇంకా తీవ్రంగా మారిందన్నారు. గత 10 రోజుల నుండి పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నదనీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం సీజనల్ వ్యాధులపై తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకోవడం తప్ప, శాశ్వత పరిష్కారం చూపడం లేదన్నారు. ప్రభుత్వం అధికారికంగా నమోదైన కేసుల సంఖ్య కంటే వాస్తవంగా చాలా ఎక్కువగా వున్నాయి. డెంగ్యూ, విషజ్వరాల వల్ల అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైనన్ని మందులు, బెడ్లు, డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, వైద్య పరికరాలు లేవు. హాస్పటల్స్ రోగులతో నిండిపోతున్నాయి. చాలా చోట్ల ప్లేట్లెట్స్ను నిర్ణయించే పరికరాలు అందుబాటులో లేవు. దీంతో పేద, మధ్య తరగతి రోగులు ప్రయివేటు హాస్పిటల్స్ ఆశ్రయిస్తున్నారు. అవసరంలేని వైద్య పరీక్షలు, బెడ్ఛార్జీలు, ఇతర ఛార్జీల పేరుతో రోగులను దోపిడీకి గురిచేస్తున్నారు. ప్రజారోగ్యం క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో తక్షణమే అన్ని గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, గూడేల్లో మొబైల్ టీమ్ల ద్వారా వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సహాయం అందించాలన్నారు. అవసరమైతే సంచార వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించాలనీ, గిరిజన ప్రాంతాల్లో దోమతెరలను పంపిణీ చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని జిల్లా సెంటర్ల లో ప్లేట్లెట్స్ కౌంట్ మిషన్స్ తో పాటు, హెల్త్ చెకప్, ఇతర వైద్య పరీక్షల పరికరాలు, మందులు, డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్తో పాటు, ఇతర స్టాప్ సమకూర్చాలి. వీటితో పాటు, ఎమర్జెన్సీ పరికరాలను అందుబాటులో ఉంచాలని సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా కమిటీ జిల్లా కలెక్టర్ ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నదన్నారు.