– విద్యాభివృద్ధికి పెద్ద పీట
– 2104 మందికి పోడు భూములు పంపిణీ
– స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ- నసురుల్లాబాద్
సమైక్య పాలనలో నిరాదరణకు గురై మౌలిక సదుపాయాలకు దూరంగా దుర్భర జీవితాన్ని గడిపిన గిరిజనులు నేడు స్వరాష్ట్రంలో సకల సౌకర్యాలతో దర్జాగా బతుకుతున్నారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా శనివారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహించిన గిరిజన దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ. 7 కోట్లతో నూతనంగా నిర్మించే గిరిజన బాలుర వసతి గృహము మరియు సిబ్బంది వసతి గృహం నిర్మాణానికి స్పీకర్ పోచారం శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. బోగ్ బండర్ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పకడ్బందీగా ప్రణాళికలను అమలు చేసి గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని. స్వయం పాలనే ధ్యేయంగా తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. గిరిజన, బంజారాల దశాబ్దాల కలలను నిజం చేసిన గొప్ప వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 53,417 కోట్లు ఖర్చు చేసిందన్నారు. గతంలో తాండాలు, గిరిజన గూడేలను గ్రామ పంచాయతీ లుగా మారుస్తామని హామీ ఇచ్చినా గత ప్రభుత్వాలు నేరవేర్చలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3146 తాండాలను గ్రామ పంచాయతీ లుగా మార్చారని గుర్తు చేశారు. గిరిజన రిజర్వేషన్లు 6 శాతం నుండి 10 శాతానికి పెంచారని తెలిపారు. కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా 1, లక్ష 55 వేల మంది గిరిజన యువతులకు రూ 1,306 కోట్ల నగధు సహాయం అందించారు. రైతుబంధు పథకం ద్వారా 8.2 లక్షల మంది గిరిజన రైతులకు ఇచ్చిన మొత్తం రూ. 8305 కోట్లు. 3.5 లక్షల మంది గిరిజను లకు ఆసరా పెన్షన్ల క్రింద ఇప్పటి వరకు ఇచ్చినవి రూ. 4,500 కోట్లు. సేవాలాల్ మహారాజ్ పుట్టినరోజును అధికారికంగా జరుపుతున్నామన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని 1.50 లక్షల మంది గిరిజన రైతులకు నాలుగు లక్షలకు పైగా ఎకరాల పోడు భూములకు చెందిన పట్టాలు అందుతాయని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని 2,104 మంది గిరిజన రైతులకు 3,830 ఎకరాల పోడు భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేస్తామన్నారు. ఈ భూములకు రైతుబంధు నగధు వస్తుంది, రైతులకు రైతుబీమా వర్తిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 98 గిరిజన గురుకుల పాఠశాలలు మంజూరు అయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి తాండాకు రోడ్డు సౌకర్యం కల్పించాం. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ లలో GP భవనాలకు రూ. 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయితే అందులో బంజారాల కోసం 2 వేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చామన్నారు. నియోజకవర్గ ప్రత్యేక నిధులతో నియోజకవర్గంలోని అన్ని తాండాలలో జగదాంబ, సేవాలాల్ మహారాజ్ దేవాలయాల కోసం రూ. 25 కోట్లు మంజూరు చేశామన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో రెండు గిరిజన బాలుర, బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి 17 కోట్లతో భవనాలకు నిధులు చేశామన్నారు. నసురుల్లాబాద్ లోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో రామారావు మహారాజ్ విగ్రహాన్ని డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి స్వంత ఖర్చులతో ఏర్పాటు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ, బోధన్ ఆర్డీఓలు రాజా గౌడ్, రాజేశ్వర్, రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ఎంపిపి పాల్త్య విఠల్, మండల పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్, జడ్పి కో అప్షన్ మెంబర్ మాజీద్, జడ్పిటిసి జన్నుబాబు ప్రతాప్ సింగ్, నాయకులు బద్యానాయక్, మోహన్ నాయక్, తహశీల్దార్ భవయ్య, ఎంపిడిఓ సుబ్రహ్మణ్యం, సభ నిర్వాకులు విజయభారతి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు హాజరయ్యారు.