గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

– గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ పాలడుగు సుధాకర్‌
నవతెలంగాణ – భువనగిరి
గ్రామపంచాయతీ కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ పాలడుగు సుధాకర్‌ అన్నారు. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు బందెల బిక్షం అధ్యక్షతన జరుగగా ముఖ్యఅతిథిగా సుధాకర్‌ హాజరై మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు ఉద్యోగ కార్మికులను సమస్యలు పరిష్కరించాలని ఏళ్ల తరబడిగా పోరాటాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కనీస వేతనాలు మూడు కేటగిరీలుగా నిర్ణయించి 15,500, 19, 500, 22, 900 చెల్లించాలని ఇన్సూరెన్స్‌ పథకం అమలు చేయాలని, ఈఎస్‌ఐ పిఎఫ్‌ అమలు చేయాలని, డబల్‌ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ల సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన దఫలవారీగా చేయనున్నట్లు తెలిపారు.12న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ధర్నా నిర్వహిస్తున్నామని పోరాటంలో కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.అనంతరం జిల్లా జేఏసీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎందుకున్నారు. జేఏసీ కమిటీ చైర్మన్‌ గా దాసరి పాండు, ప్రదాన కార్యదర్శి గణపతి రెడ్డి, కోశాధికారిగా, వెంకటేశం కన్వీనర్లుగా పొట్ట యాదమ్మ, గడ్డం ఈశ్వర్‌, బంజర భిక్షం, బాలమణి, సాయిలు, యాదగిరిలను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శి బాలకృష్ణ, బోడ భాగ్య, నాయకులు రెడ్డబోయిన ఐలయ్య, యాదగిరి రమేషు బాబు సాయిలు, సలీం, నరసింహ ఎల్లమయ్య, కిష్టయ్య పాల్గొన్నారు.