నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు శత జయంతిని పురస్కరించుకుని ఎఫ్ టీ పి సి ఇండియా, తెలుగు సినిమా వేదిక సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఏఎన్ఆర్ సెంటినరీ పాన్ ఇండియా అవార్డ్స్ వేడుక ప్రసాద్ ల్యాబ్లో అంగరంగ వైభవంగా జరిగింది. మురళీ మోహన్, నిర్మాతలు రమేష్ ప్రసాద్, దామోదర్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, వైవిఎస్ చౌదరి, ప్రసన్న కుమార్, సామాజికవేత్త వరలక్ష్మి, ఫిట్నెస్ ట్రైనర్ అను ప్రసాద్ ముఖ్య ఆతిధులుగా విచ్చేసిన ఈ వేడుకలో సినీ, సామాజిక రంగాలకు చెందిన వారిని ఘనంగా సత్కరించారు. ఎఫ్ టి పీ సి అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ, ‘దేశవ్యాప్తంగా మరోసారి ఏఎన్నార్ని స్మరించుకొనేలా చెయ్యాలన్న ఉద్దేశ్యంతోనే 10 రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను సత్కరించుకొనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం’ అని అన్నారు. ‘ఏఎన్నార్ అభిమానులతోపాటు వివిధ రంగాల ప్రముఖులను సత్కరించుకొనే అవకాశం కలగడం తమ సంస్థలకు గర్వకారణం’ అని తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు విజరు వర్మ పాకలపాటి చెప్పారు.