జులై 8 నుంచి గ్రూప్‌-2 అభ్యర్థులకు గ్రాండ్‌టెస్ట్‌

– నేటినుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ : బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌-2 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిల్‌ కేంద్రాల్లో వచ్చేనెల ఎనిమిది నుంచి గ్రాండ్‌ టెస్ట్‌లను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ డి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చేనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో మొదటి గ్రాండ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తామని తెలిపారు. రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తామనీ, మొదటి రోజు ఉదయం పేపర్‌-1, మధ్యాహ్నం పేపర్‌-2, రెండో రోజు ఉదయం పేపర్‌-3, మధ్యాహ్నం పేపర్‌-4 రాతపరీక్షలుంటాయని వివరించారు.
రెండో గ్రాండ్‌టెస్ట్‌ వచ్చేనెల 15,16 తేదీల్లో, మూడో గ్రాండ్‌ టెస్ట్‌ అదేనెల 22, 23 తేదీల్లో, నాలుగో గ్రాండ్‌ టెస్ట్‌ను జులై 30,31 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ గ్రాండ్‌ టెస్ట్‌లకు హాజరు కావాలనుకునే ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు బుధవారం నుంచి వచ్చేనెల ఐదో తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌ను చూడాలనీ, మరిన్ని వివరాలకు 040-24071178 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.