– విశ్వాసం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లు, ప్రజలకు ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించిన క్షేత్రస్థాయి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లు, ప్రజలందరికీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎదురుదెబ్బలు ఎన్ని కొట్టావు అన్నది కాకుండా ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా సవాళ్లు ఎదుర్కొని తిరిగి నిలబడి పోరాటం చేశామన్నదే ముఖ్యం అన్న నానుడిని నిజం చేసినందుకు ఆయన అభినందనలు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి బలంగా నిలబడి కొట్లాడడం ఆషామాషి వ్యవహారం కాదనీ, పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన నిబద్ధతతో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ వెంట నడిచి, ఎన్నికల్లో ప్రజామోదం కోసం కొట్లాడిన తీరు అద్భుతమని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఐదు నెలలుగా సామాజిక మాధ్యమాల్లో పార్టీ కోసం పని చేసిన, ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ సోషల్ మీడియా వారియర్లకు, కార్యకర్తలకు ఇతర పార్టీల మాదిరి ఎలాంటి చెల్లింపులు చేయకుండా పార్టీ మీద, తెలంగాణ మీద ప్రేమతో పనిచేశారని కొనియాడారు. కేవలం తెలంగాణ మీద ఉన్న ప్రేమ కేసీఆర్పైన ఉన్న అచంచలమైన విశ్వాసంతో తమ పార్టీ కార్య కర్తలు ఈ ఎన్నికల్లో తమ వాణిని బలంగా విని పించి, అద్భుతంగా కొట్లాడారని పేర్కొన్నారు. తమ పార్టీ శ్రేణులు చేసిన ఈ పోరాటంతో పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప ఫలితాలు వస్తాయంటూ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతోపాటు తమ వెంట నిలిచిన రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.