– మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం
– త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం
– సెప్టెంబర్లో రాతపరీక్ష నిర్వహణ?
– విద్యాశాఖ అధికారుల కసరత్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని బీఎడ్, డీఎడ్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నిర్వహించాలని విద్యాశాఖ మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టి హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎ ఇంద్రకరణ్రెడ్డి, జి జగదీశ్రెడ్డితోపాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలతోపాటు టెట్ నిర్వహణ, మన ఊరు-మనబడి పురోగతిపై చర్చించినట్టు తెలిసింది. అయితే మంత్రి కేటీఆర్ గైర్హాజరు కావడం, ఇతర మంత్రులు వేరే పనుల వల్ల తొందరగా వెళ్లిపోవడంతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది జూన్ 12న టెట్ను నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ వచ్చాక మూడుసార్లు టెట్ను నిర్వహించింది. తొలిసారి 2016, మే 22న, రెండోసారి 2017, జులై 23న, మూడోసారి గతేడాది జూన్ 12న టెట్ రాతపరీక్షలు జరిగాయి. చివరిసారి నిర్వహించిన టెట్ పేపర్-1కు 3,51,476 మంది దరఖాస్తు చేయగా 3,18,444 మంది పరీక్ష రాశారు. వారిలో 1,04,078 (32.68 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2కు 2,77,893 మంది దరఖాస్తు చేస్తే, 2,50,897 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 1,24,535 (49.64 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారు. 2017, జులై 23న టెట్ పేపర్-1కు 98,848 మంది హాజరుకాగా, 56,708 (57.37 శాతం) మంది అర్హత సాధించారు. పేపర్-2కు 2,30,932 మంది పరీక్ష రాస్తే 45,045 (19.51 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
టెట్ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు
రాష్ట్రంలో మరోసారి టెట్ను నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించడంతో ఆ దిశగా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. త్వరలోనే టెట్ నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెలాఖరులోగా లేదా వచ్చేనెల మొదటివారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమున్నట్టు తెలిసింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక అభ్యర్థుల సన్నద్ధత కోసం కనీసం 45 రోజుల సమయం ఉండాలి. అంటే సెప్టెంబర్లో టెట్ రాతపరీక్షలను నిర్వహించే దిశగా షెడ్యూల్ను రూపొందించే పనిలో అధికారులు నిమగమయ్యారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా బీఎడ్, డీఎడ్ ఉత్తీర్ణతతోపాటు టెట్ పాస్ కావాలన్న నిబంధన ఉన్నది. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీని కల్పిస్తున్నారు. అంటే టీఆర్టీ రాతపరీక్షకు 80 శాతం మార్కులు, టెట్లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి రెండింటిలో మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందుకే టెట్కు ప్రాధాన్యత నెలకొంది. 2011 నుంచి టెట్ అర్హత సంపాదిస్తే జీవితకాలం ఉంటుందని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను గతంలోనే విడుదల చేసింది. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులూ అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఎప్పుడు?
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే వాటి భర్తీ కోసం ఆర్థిక శాఖ ఇంత వరకు అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు. రాష్ట్రంలో 1.50 లక్షల మంది డీఎడ్, 4.5 లక్షల మంది బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులున్నారు. రాష్ట్రంలో 2017లో 8,792 పోస్టుల భర్తీ కోసం ఉపాధ్యా నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల కాలేదు. టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలన్న నిర్ణయం మంచిదే కానీ టీఆర్టీ నోటిఫికేషన్ సంగతేంటని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ నిర్వహణ లోపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి నోటిఫికేషన్ను విడుదల చేయాలని తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రావుల రామ్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు.