– పలు జిల్లాలకు పొగమంచు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో చలితీవ్రత పెరుగుతున్నది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని 33 జిల్లాలకు గానూ 31 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉదయంపూట పొగమంచు ఏర్పడే అవకాశముంది. రాష్ట్రం మీదుగా ఆగేయం దిశ నుంచి కిందిస్థాయిలో గాలులు వీస్తున్నాయి. రాబోయే మూడు రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని ఐఎమ్డీ తెలిపింది.