కాంగ్రెస్‌కు గుదిబండలా హామీలు

To Congress Gudibandala assurances– ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలిసీతెలియక ఇచ్చిన హామీలు కాంగ్రెస్‌కు గుదిబండలా మారాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే బీఆర్‌ఎస్‌ను రద్దు చేయమనడం కాంగ్రెస్‌కు సబబు కాదన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీని రద్దు చేస్తే తమని ప్రశ్నించేవారు ఉండరనేదే వారి ఉద్దేశంలా ఉందన్నారు. తాము 420 గాళ్లమని వాళ్లకు వాళ్లే చెప్పుకునే విధంగా కాంగ్రెస్‌ వ్యవహారం ఉందని, వాళ్ల దొంగతనాన్ని వాళ్లే బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పరిపాలన గొప్పతనంపై ప్రజల్లో చర్చ మొదలైందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనన్నారు. పథకాల అమలుకు సమయం తీసుకుంటే తప్పులేదు కానీ, ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయాలని చూస్తే సాధ్యం కాదన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌ ఆ హామీని అటకెక్కించి, ప్రజల నుంచి బిల్లులు వసూలు చేస్తోందన్నారు. పైగా బిల్లు చెల్లించకపోతే వచ్చేనెల రెట్టింపు అవుతుందన్న రీతిలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. పరిపాలన చేతకాకపోతే అనుభవిజ్ఞుల సహాయం తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.