నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంగుల పండుగ హోలీని అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్తవర్ణ రంగుల శోభను నింపుతాయని అభిప్రాయపడ్డారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటి చెప్పే ఈ పండుగ దేశమంతటా కొత్త మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకనుగుణంగా త్వరలోనే దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే కొత్త ప్రజాస్వామ్య వాతావరణం వెల్లివిరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.