నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హౌలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరిచి, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి కేరింతలతో ఆనందో త్సాహాల నడుమ రంగులతో జరుపుకునే ప్రకృతి పండుగ హౌలీ అని తెలిపారు. హౌలీ పండుగ భారతీయ సామాజిక సాంస్కృతిక జీవన ప్రత్యేకతను చాటుతుందని కేసీఆర్ అన్నారు. వసంతాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తూ జరుపుకునే హౌలీ పర్వదిన సందర్భంగా ఆ ప్రకృతీమాత ప్రజలందరినీ చల్లగా చూడాలని కేసీఆర్ ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హౌలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని హౌలీ పండుగ స్వాగతం పలుకుతుందని ఆయన అన్నారు. ప్రజలందరూ మోదుగుపూల వంటి సహజసిద్దమైన రంగులతో హౌలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు .