మైనార్టీలో హర్యానా సర్కార్‌

– ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేల మద్దతు వాపసు
– సీిఎం సైనీ రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్‌
ఛండీగఢ్‌ : ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ‘ఆపరేషన్‌ లోటస్‌’ ద్వారా కూల్చే బిజెపికి హర్యానాలో షాక్‌ తగిలింది. బిజెపి ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మంగళవారం ప్రకటించారు. దీంతో నయాబ్‌ సింగ్‌ సైనీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు తెలుపుతున్నా మెజార్టీకి ఇంకా రెండు స్థానాలు తక్కువగా ఉండడం తో సైనీ ప్రభుత్వం అధికారంలో కొనసాగే అర్హతను కోల్పోయింది. మార్చిలో జననాయక్‌ జనతా పార్టీ (జెజెపి) సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా. ఆ పార్టీలోని కొంతమంది మద్దతు తెలుపుతుండటం తో బిజెపి ప్రభుత్వం ఇన్నాళ్లూ నెట్టుకొచ్చింది. తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేలు సోంబిర్‌ సంగ్వాన్‌ (దాద్రీ), రణధీర్‌ సింగ్‌ గొల్లెన్‌ (పుండ్రి), ధరంపాల్‌ గోండర్‌ (నీలోఖేరి) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు గవర్నర్‌కు లేఖ పంపినట్లు తెలిపారు. మైనార్టీలో పడిన షైనీ ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. రాష్ట్రపతిపాలన విధించి అసెంబ్లీకి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కోరింది. హర్యానా అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా, ప్రస్తుతం 88 మంది సభ్యులు ఉన్నారు.. బిజెపికి 40, కాంగ్రెస్‌కు 30, జెజెపికి 10 మంది ఉన్నారు. మిగతావారు ఇండిపెం డెంట్లు. ఈ ఏడాది అక్టోబర్‌లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.