కొందరివాడు కాదు.. అందరివాడు

– మూసీ మురికి నీటి నుండి విముక్తి కల్పించిన ఘనత మంత్రిదే
– మంత్లీ మామూళ్లు లేవు…. రౌడీ బెదిరింపులు లేవు…వ్యాపారులు
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్లజగదీశ్‌రెడ్డి పాలనే సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు శ్రీరామరక్ష అని కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు, వ్యాపారవేత్త బొమ్మిడి లక్ష్మీనారాయణ కొనియాడారు.సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో వ్యాపారులతో కలిసి మర్యాదపూర్వకంగా మంత్రి కలిసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.గతంలో విషం అని తెలిసినా మూసీ మురికినీటిని తాగిన సూర్యాపేట వాసులకు మిషన్‌ భగీరథ ద్వారా ఆ పీడ నుండి విముక్తి కల్పించిన ఘనత మంత్రిదేనన్నారు.గత పాలకుల హయాంలో రౌడీల బెదిరింపులు.. మామూళ్ల కోసం దౌర్జన్యాలతో అనుక్షణం బిక్కుబిక్కుమంటూ గడిపిన వ్యాపారవర్గాలకు రౌడీల వేధింపుల నుండి విముక్తి కల్పించింది కూడా మంత్రిదేనని తెలిపారు.శాంతిభద్రతల విషయంలో రాజీలేని ఆయన పాలనలో సూర్యాపేట ప్రాముఖ్య వ్యాపారకేంద్రంగా విరాజిల్లుతున్నదన్నారు.కొంతమంది స్వార్థం కోసం మచ్చలేని మంత్రిపై చేస్తున్న ఆరోపణలు నవ్వు తెప్పిస్తున్నాయని తెలిపారు.ఆయన వేసిన రహదారులు, మెడికల్‌ కళాశాల, ట్యాంక్‌బండ్‌, సమీకత మార్కెట్‌, ఎస్పీ, కలెక్టర్‌ కార్యాలయాలు ఏ ఒక్క సామాజిక వర్గానికో పరిమితం కాకుండా అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొంతమంది అజ్ఞానులు మంత్రిని కొందరివాడుగా చిత్రీకరించడానికి యత్నిస్తున్నారని తెలిపారు.దీనిని వ్యాపారవర్గాలు మొత్తం ఖండిస్తున్నామని తెలిపారు.రాబోయేరోజుల్లో వ్యాపారవర్గాలు మంత్రికి మద్దతుగా నిలబడి ఆయన హ్యాట్రిక్‌ విజయంలో పాలుపంచుకుంటామని తెలిపారు.