భువనేశ్వర్: స్కూల్లో చదువుతున్న ఇద్దరు బాలికలపై హెడ్మాస్టార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తర్వాత బాలికలు స్కూలుకు వెళ్లేందుకు నిరాకరించారు. తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన దారుణం గురించి చెప్పారు. పేరెంట్స్ ఫిర్యాదుతో ఆ హెడ్మాస్టార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 16న ప్రయివేట్ స్కూల్కు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఆరు, ఏడు తరగతులు చదువుతున్న ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ మరునాడు స్కూల్కు వెళ్లేందుకు బాధిత బాలికలు నిరాకరించారు. ఏం జరిగిందని తల్లిదండ్రులు ఒత్తిడి చేయగా ఈ విషయం చెప్పారు. దీంతో బాలికల పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు ఈ సంఘటనపై స్పందించారు. నిందితుడైన 45 ఏళ్ల హెడ్మాస్టార్ను అరెస్ట్ చేశారు.
పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రైవేట్ స్కూల్ ఉదయం 6.30 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పని చేస్తుందని పోలీసులు తెలిపారు. అనంతరం కొందరు విద్యార్థులు ట్యూషన్ కోసం స్కూల్లో ఉంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో స్కూల్ తర్వాత ఇద్దరు బాలికలపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.