నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఉద్యోగ ఉపాధ్యాయులకు వచ్చే నెలలో హెల్త్ కార్డుల ద్వారా ప్రయోజనాలు చేకూరానున్నాయని ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సదానందం గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్ లో జరిగిన ఎస్టీయు జిల్లాసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంతోకాలంగాఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న హెల్త్ కార్డుల ప్రయోజనాలు వచ్చే నెల నుండి చేకూరానున్నాయని పేర్కొన్నారు. అలాగే జీవో 317 ద్వారా స్పౌజ్ ఉపాధ్యాయులకు సంబందించిన ఉత్తర్వులు విడుదల కానున్నాయని తెలియజేశారు. పెండింగ్ నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలనీ ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక వార్డెన్ లను నియమించాలని అన్నారు. ఉన్నతీకరించబడిన ఆశ్రమ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయాలని పండిట్, పిఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కౌన్సిల్ సమావేశానికి జిల్లా అధ్యక్షులు మూగ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ అశోక్ కుమార్ కార్యదర్శి నివేదికను బి మనోహర్ ఆర్థిక కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టగా చప్పట్లతో ఆమోదించారు. అనంతరం ఇటీవల నూతనంగా నియామకం పొందిన ఉపాధ్యాయులకు పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి దిలేష్ చౌహాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శీతల్ చౌహన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పూర్వ అధ్యక్షులు చిలుక విలాస్, ముకుందరావు, హెడ్ క్వార్టర్ సెక్రెటరీ పోల్ రెడ్డి, జిల్లా సహాధ్యక్షులు జాదవ్ రవికుమార్ ఆత్మరామ్, జిల్లా ఆర్థిక కార్యదర్శి బి మనోహర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.