మల్లు స్వరాజ్యం... పోరాటానికి పర్యాయ పదం భూమికోసం.. భుక్తికోసం… పేద ప్రజల విముక్తికోసం సొంత జీవితాన్ని వదిలిపెట్టిన స్ఫూర్తి చరిత పట్టుకుంటే పదివేల బహుమానమన్న నిజాం సర్కారు పై బరిగీసి ఎక్కు పెట్టిన బందూక్ చావుకు వెరవని గెరిల్లా యోధురాలు. అసెంబ్లీలో ఆమె మాట తూటా. పదవి లేకపోయినా ప్రజా సమస్యలే ఎజెండా. ఆమె పోరాటాల ఎర్రజెండా..
బాల్యంలో ఓ ఘటన మల్లు స్వరాజ్యం ఆలోచనను మార్చేసింది. అప్పట్లో వడ్లను కూలోల్లే దంచేటోళ్లు. ముఖ్యంగా ఆడవాళ్లు. పుట్లకొద్ది దంచినా కూలీ ఉండదు. రోజుల తరబడి పని జరిగేది. అలా దంచుతున్న ఎల్లమ్మ అనే కూలీ కళ్లు తిరిగి పడిపోయింది. అక్కడే కాపలాగా ఉన్న స్వరాజ్యం నీళ్లు తీస్కపోయి తాగించారు. అన్నం తినలేదని చెబితే.. అన్నం తీసుకొచ్చి తినిపించారు. మిగిలిన కూలీలు తినలేదంటే… చూస్తే అన్నం లేదు.
బియ్యం నానబెట్టుకుని తింటామంటే వాళ్లకు సాయం చేశారు. అట్లా సాయపడ్డందుకు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. స్వరాజ్యం చిన్నాయనలు తప్పుబట్టి తిట్టిండ్రు. అప్పుడు వాళ్లమ్మ చొక్కమ్మ అండగా నిలబడ్డది. ‘చిన్న పిల్ల ఏమనకండి’ అని వెనకేసుకొచ్చింది. కష్టం చేసే వ్యక్తికి తినే హక్కెందుకు లేదోనన్న ఆలోచన ఆనాడే స్వరాజ్యం మనసులో అంకురించింది. అక్కడినుంచే ఆమె తిరుగుబాటు నేర్చుకున్నారు.
స్వరాజ్యంపై అమ్మ చొక్కమ్మ ప్రభావం ఎక్కువ. బిడ్డను రాణీరుద్రమలా పెంచాలి అనుకునేవారామె. స్వరాజ్యం ఎనిమిదో ఏట తండ్రి మరణించాడు. అప్పటికే అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్) ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఆయన ప్రోత్సాహంతో బాలల సంఘం పెట్టారు స్వరాజ్యం. అన్న తెచ్చిచ్చిన మాక్సీం గోర్కీ ‘అమ్మ’ పుస్తకాన్ని వాళ్లమ్మతో కలిసి చదివారు.
రాత్రి దాలిలో పాలు కాగబెట్టి.. తోడెయ్యడం కోసం వాటిని ఆరబెట్టినప్పుడు కూర్చుని చదివిన ఆ పుస్తకంలోని అక్షరం అక్షరం ఆమె మనసులో ముద్రించుకు పోయింది. పుస్తకంలోని అమ్మ పాత్ర వాళ్లమ్మను, ఆమెను ప్రభావితం చేసింది. అందుకే బీఎన్ను సాషా అని పిలుచుకునేవారామె. కొడుకుతోపాటు కూతురు కూడా పోరాటంలోకి వెళ్తానంటే అడ్డుపడలేదు సరికదా… ప్రోత్సహించి ఉద్యమాల్లోకి పంపించిందా అమ్మ. అలా తన 11వ ఏట గెరిల్లా యుద్ధంలో శిక్షణ, ఆత్మరక్షణా పద్ధతులు నేర్చుకున్నారు. 12 ఏండ్లకే ఆంధ్రమహాసభలో చేరారామె. ఆ తరువాత వారిల్లు ఆంధ్ర మహాసభకు కేంద్రమయ్యింది.
కూలిరేట్ల పెంపు… పెద్ద మలుపు.. : తెలంగాణలో వెట్టిచాకిరీ, భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కూలీ పెంచాలని ఉద్యమం మొదలైంది. తమది దొరల కుటుంబమే అయినా… ఊళ్లో ఉన్న జీతగాళ్లు, కూలోళ్లందరినీ కూడగట్టి సమ్మె చేద్దామని ప్లాన్. అప్పటికే పోలీస్ పటేల్ అయిన స్వరాజ్యం చిన్నాయన తుంగతుర్తి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో బీఎన్ను అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారు. తల్లి పోలీసులను దర్వాజ కాడనే అడ్డుకుంటే… అన్నను ఊరుదాటించారు స్వరాజ్యం. ఆయన వెళ్తూ ‘నేను పోతున్న… సమ్మె జరిగేట్టు చూడాలె అంటూ చెల్లెలకు బాధ్యతను పెట్టాడు. తెల్లారి వాడలన్ని తిరిగి పనికి పోవద్దని చెప్పారామె.
అయినా వినలేదు… తన చిన్నాన్న పనిలోకే పోతున్నరని తెలిసి, వాగులో వాళ్లకడ్డం పడుకున్నది. ‘మీరు కూలికి పోవాలంటే.. నన్ను దాటుకుపోండి’ అని పట్టుబట్టారామె. భూస్వాముల బిడ్డ కావడంతో ఆమెను దాటి వెళ్లలేక ఆరోజుకు వెనుదిరిగారు. మరునాడు పనిలోకి రానందుకు పోలీసు పటేల్ కూలోళ్లను పిలిచి పంచాయతీపెట్టిండ్రు. అది తెలిసిన స్వరాజ్యం.. ‘దెబ్బ నామీద పడ్డంకనే వాళ్ల మీద పడాలి’ అంటూ బాబాయి దౌర్జన్యాన్ని అడ్డుకున్నారు.
రేటు పెంచితే తప్ప పనిలోకి రాలేమన్నరు కూలీలు. అప్పటిదాకా సోలెడున్న కూలీ… మూడు సోలెలు అయ్యింది. సమ్మె జయప్రదమైంది. అది స్వరాజ్యం ఉద్యమ జీవితంలో తొలి అడుగు.
ఉయ్యాల పాటల చైతన్యం : స్వరాజ్యం… గొంతెత్తితే తెలంగాణ నేల ఊగింది ఉయ్యాల. చిన్నప్పటినుంచే ఆమెకు పాటంటే ప్రాణం. పాడుతోందని ఆంధ్రమహాసభ సమావేశాల్లో పాడించేవాళ్లు. పాలకుర్తి ఐలమ్మ పోరాటానికి మద్దతుగా సంఘం నిలబడాలనుకున్నది. పాలకుర్తిలో మీటింగ్ పెట్టారు. సభలో పాటలు పాడేందుకు స్వరాజ్యంను తీసుకెళ్లారు బీఎన్. సభ సక్సెస్ అయ్యింది. ఐలమ్మ పోరాటం ఫలించింది.
‘విస్నూరు దొర చేతిలో సచ్చినా సరే… భూమిని వదలను’ అని పోరు జేసిన ఐలమ్మ తనకు స్ఫూర్తి’ అని చెప్పేవారామె.. ‘ఏనాడు గడీలనొదిలి వాడల్లో జొరబడ్డానో… ఆవా? ఉద్యమ జన్మస్థానాలు. నా ఉపన్యాసాలకు విషయాన్ని, నా పాటలకు బాణీలని, నా జీవితానికొక చరిత్రను ఇచ్చింది వాళ్లే’ అన్న స్వరాజ్యం 13ఏళ్ల వయసులోనే విప్లవ గీతమయ్యారు. విసునూరు దేశ్ముఖ్ దురాగతాలను ఎండగట్టే ఉయ్యాల పాటలను ప్రచారానికి ఆయుధంగా చేసుకుంది. 15 ఏళ్ల వయసులో ఆమె ఉపన్యాసాలు విని జనం ఉర్రూతలూగారు.
16 ఏళ్లకే గెరిల్లా… : భూస్వాముల దగ్గరున్న ఆయుధాలు స్వాధీనంతో మొదలైన పోరు.. పోలీసు క్యాంపుల దాకా కొనసాగింది. గ్రామాల మీద దాడి చేసిన పోలీసులు దగ్గర్నుంచి ఆయుధాలు గుంజుకోవడంలో మహిళలకు శిక్షణ నిచ్చారు స్వరాజ్యం. ఆకునూరు, మాచిరెడ్డిపల్లి, సూర్యాపేట, మల్లారెడ్డిగూడెం, పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు స్వరాజ్యం. కడివెండి పోరాటంలో మహిళలను కూడగట్టడంలో ఆమెది ప్రధాన భూమిక.
నల్గొండ, వరంగల్ జిల్లాల్లో దాదాపు పదిహేను సాయుధ పోరాటాలు ఆమె నాయకత్వంలో జరిగాయి. చెట్లపై నిజాం సర్కార్ పెత్తనాన్ని సవాలు చేస్తూ… ‘గీసే వాన్నిదే చెట్టు.. దున్నేవాడిదే భూమి’ నినాదానికి పార్టీ పిలుపునిచ్చింది. సూర్యాపేట తాలూకాలో నిర్వహణ బాధ్యతలు స్వరాజ్యానికి అప్పగించారు. గ్రామరాజ్యాలు, గ్రామ రక్షణ మహిళా దళాలు ఏర్పాటు చేయడం, భూపంపిణీని ఆమె చాలా సమర్థవంతంగా నిర్వహించారు. కోయగూడేం వంటి ఘటనలు ఆమెను మరింత రాటు తేల్చాయి. అలా ఆమె పోరాటం చేయని ప్రజా సమస్య లేదు.
అసెంబ్లీలో నిలబడినా ఎక్కడైనా, ఎప్పుడైనా ఆమెది గ్రామాల్లో తిరిగి పనిచేసినా.. తుపాకీ పట్టి గెరిల్లాగా ఉన్నా, పోరాటమే. దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. పోరాటాలు ఉన్నంత కాలం.. మల్లు స్వరాజ్యం పేరు ఉంటుంది.
– సోపతి డెస్క్