– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
– 1560 మంది ఆశావర్కర్లకు నియామక పత్రాలు అందజేత
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఆశా వర్కర్లకు ఎక్కువ వేతనాలు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. కొత్తగా ఎంపికైన 1560 మంది ఆశావర్కర్లకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొండాపూర్ డివిజన్ పరిధిలోని శిల్పకళా వేదికలో మంత్రులు మహ్మద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి హరీశ్రావు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆశావర్కర్ల మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదని అన్నారు. బస్తీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు ఏ రోగం వచ్చినా గాంధీ, ఉస్మానియా దవాఖానలకు వెళ్లేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. దీంతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఓపీ శాతం తగ్గిందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టీ-డయాగస్టిక్స్లో ఉచితంగా 134 పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ఎంపికైన ఆశావర్కర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలోని ఆరోగ్య సేవలు దేశానికే ఆదర్శమన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 26 బస్తీ దవాఖానలు ఉన్నాయని, వీటిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.