ఉద్యోగాలివ్వాలా? వాయిదా వేయాలా?

– కేటీఆర్‌ స్పష్టం చేయాలి : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వమంటారా? పరీక్షలు వాయిదా వేయమంటారా? ఏదో స్పష్టంగా చెప్పాలంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఏ పరీక్ష ఎప్పుడు పెట్టాలో అసలు మీకు క్లారిటీ ఉందా..? అని నిలదీశారు. గతానికి ఇప్పటికీ పోస్టులు పెంచింది నిజమా? కాదా? చెప్పాలని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ సర్కారు 5,500 డీఎస్సీ పోస్టులు ఇస్తే, కాంగ్రెస్‌ సర్కారు 11వేల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వడం నిజం కాదా? అని ప్రశ్నించారు. పదేండ్లలో ఒక్క గ్రూప్‌ వన్‌ కూడా పరీక్ష నిర్వహించలేదనీ, ఏ పరీక్ష నిర్వహించినా పేపర్‌ లీకులే అయ్యాయని విమర్శించారు. జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా మిగతా డీఎస్సీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.