ఎన్నికలైనా జరపండి.. సర్పంచులనైనా కొనసాగించండి

– స్పెషల్‌ ఆఫీసర్లతో ప్రజాస్వామ్యం ఖూనీ : మురళీధర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలనీ, లేనిపక్షంలో, సర్పంచులనైనా బాధ్యతల్లో కొనసాగించాలని బీజేపీ నేత మురళీధర్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్పంచులకు పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కాళేశ్వరం, ధరణి, ఔటర్‌ టోల్‌గేట్‌ లీజ్‌ అతి పెద్ద స్కామ్‌లని ఆరోపించారు. కాళేశ్వరంపై విచారణ ఏమైందని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇండియా కూటమి హోటల్‌, వర్చువల్‌ మీటింగ్‌లకే పరిమితమనీ, ఆ కూటమికి కామన్‌ మ్యానిఫెస్టో, కామన్‌ డిక్లరేషన్‌ లేదని విమర్శించారు.