– నారా లోకేశ్ను అడిగిన కేంద్ర మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం కేంద్ర హౌంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబుపై కేసులు, ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి లోకేశ్ వివరించారు. చంద్రబాబును అరెస్ట్ చేసి విచారణ పేరుతో వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణినీ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రికి తెలిపారు.
‘చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు? మీపై ఎన్ని కేసులు పెట్టారు’ అని ఈ సందర్భంగా అమిత్ షా లోకేశ్ను అడిగారు. చంద్రబాబు ఆరోగ్యంపై కూడా ఆయన ఆరా తీశారు. 73 ఏండ్ల వయసున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఏపీలో జరుగుతోన్న పరిణామాలను తాను గమనిస్తున్నట్లు లోకేశ్కు చెప్పారు. ఈ సమావేశంలో లోకేశ్ వెంట కేంద్రమంత్రి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఉన్నారు.