‘అన్ని వర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి మా ‘డాకు మహారాజ్’ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా పట్ల బాలకష్ణ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాని బాగా ఎంజారు చేస్తున్నారు. పండగ సీజన్ కూడా కావడంతో ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుందనే నమ్మకం ఉంది’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘డాకు మహారాజ్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సినిమాకి వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, ‘తిరుమల ఘటన నేపథ్యంలో అనంతపురంలో తలపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేశాం. అందుకే ఈ వారంలో సక్సెస్ మీట్ను అనంతపురంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు. ‘బాలకష్ణ కెరీర్లో గొప్ప సినిమాల్లో ఒకటిగా ‘డాకు మహారాజ్’ నిలుస్తుందని నాగవంశీ అన్నారు. ఆయన ఈ సినిమాని ఎంతో నమ్మారు. వంశీ నమ్మకం నిజమై, ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో విజయాన్ని అందుకున్నాను. ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో వచ్చాను. సినిమాకి వస్తున్న స్పందన పట్ల బాలకష్ణ చాలా హ్యాపీగా ఉన్నారు’ అని దర్శకుడు బాబీ కొల్లి చెప్పారు.