ఈదురు గాలులతో అపార నష్టం ..

– రోడ్డున పడ్డ కుటుంబాలు 
– సందర్శించిన జిల్లా అధికారులు
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
బాన్సువాడ డివిజన్ పరిధిలోని బాన్సువాడ బీర్కూర్ నసురుల్లాబాద్ బాన్సువాడ మండలం పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో నివాస ఇండ్లు చెట్లు కరెంటు స్తంభాలు విరిగే రోడ్డున పడ్డాయి. బాన్సువాడ మండలం బోర్లం, బోర్లం క్యాంప్  లో గత రాత్రి గాలివాన బీభత్సానికి  గురైన బాధితులను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ పరమార్శించి భరోసా కల్పించారు.  జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు సోమవారం   అదనపు కలెక్టర్  బోర్లం , బోర్లం క్యాంప్ లో  దెబ్బతిన్న రేకుల ఇండ్లు, పెంకుటిల్లులు, కల్కి  చెరువు ప్రాంతంలో నేలకొరిగిన, ధ్వంసమైన  విద్యుత్ స్థంబాలు  సందర్శించారు. ఈదురుగాలులకు 60 ఇండ్ల మేర నష్టం వాటిల్లగా, 15 ఇండ్ల పై కప్పు రేకులు లేచిపోయి  నిరాశ్రయులై   పక్క ఇండ్లలో ఆశ్రయం పొందిన బాధితులను పరమార్శించి  ప్రభుత్వానికి నివేదిక అందించి అన్ని విధాలా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు.  తహశీల్ధార్, డిప్యూటీ తహశీల్ధార్ లు రెండు రోజులలోగా క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందజేయవలసినదిగా ఆదేశించారు. తక్షణ సాయంగా బాధితులకు ఉచితంగా 10 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, మంచినూనె, కారం, చినేతపండు, ఉప్పు వంటివి అందించవలసినదిగా సూచించారు. అనంతరం బాన్సువాడ, పిట్లం, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాలలోని పలు రైస్ మిల్లులను సందర్శించారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యమును సకాలంలో ప్రభుత్వానికి అందించాలని ఆయన సూచించారు. తహసీల్ధార్లు, డిప్యూటీ తహసీల్ధార్లతో కలిసి  అన్ లోడింగ్ పాయింట్ లను ఎక్కువగా పెట్టుకొని త్వరగా ధాన్యం దించుకోవాలని మిల్లర్లకు సూచించారు. ముందుగా బాన్సువాడలో ఉమా మహేశ్వర ఇండస్ట్రీస్, పిట్లం లోని వైష్ణవి ఆగ్రో ఇండస్ట్రీస్, బిలాల్ బిన్నీ రైస్ మిల్, బిచ్కుంద లోని శివ బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్, నాసురుల్లాబాద్ లోని పారిజాత ఇండస్ట్రీస్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను సందర్శించారు. జిల్లాలో ఇప్పటి వరకు 350 కొనుగోలు కేంద్రాలకు గాను 310 కేంద్రాలలో కొనుగోళ్లు పూర్తిచేశామని, మిగిలిన 40 కేంద్రాలలో ధాన్యం 2,3 రోజులల్లో సేకరించి ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఇప్పటి వరకు 52,413 మంది రైతుల నుండి 670 కోట్ల విలువల 3,03,852 మెట్రిక్  టన్నుల   ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 603 కోట్లు చెల్లించామని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, తహాసీల్ధార్ వరప్రసాద్, డిప్యూటీ తహసీల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.