భారత్‌కు భారీ ఓటమి

– 1-5తో ఆసీస్‌ చేతిలో చిత్తు
పెర్త్‌ (ఆస్ట్రేలియా): 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నద్ధతలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన హాకీ ఇండియా పేలవ ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భారీ పరాజయం మూటగట్టుకుంది. 1-5తో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇస్తారనుకున్న భారత ఆటగాళ్లు.. దారుణంగా విఫలమయ్యారు. మ్యాచ్‌ ఆరంభం నుంచీ మ్యాచ్‌ను నియంత్రణలో నిలుపుకున్న కంగారూలు.. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజ వేశారు. భారత్‌ తరఫున ఏకైక గోల్‌ 47వ నిమిషంలో గుర్జంత్‌ సింగ్‌ కొట్టాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు టామ్‌ విక్హమ్‌ (20వ, 38వ నిమిషం), టిమ్‌ బ్రాండ్‌ (3వ నిమిషం), జోయెల్‌ రింటాల (37వ నిమిషం), ఫ్లిన్‌ (57వ నిమిషం) గోల్స్‌ నమోదు చేశారు. భారత్‌, ఆస్ట్రేలియా ఆదివారం రెండో టెస్టులో తలపడనున్నాయి.