మరో సియోల్‌ నగరం కానున్న హైదరాబాద్‌

– మూసీ ప్రక్షాళనతో కలలకు సాకారం : ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌ నగరం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ కాబోతున్నదని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. చామల తోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల బృందం నాలుగు రోజుల పర్యటన నేపథ్యంలో నేడు రెండో రోజుకు చేరుకుంది. మంగళవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్‌గౌడ్‌తోపాటు అధికారులు, జర్నలిస్టుల బృందం సీయోల్‌లో చెంగిచియాన్‌నది, హన్‌నదులను పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. అక్కడ ఉన్న నదులు వాటి ప్రక్షాళన, అనంతరం చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే వనరుల పునర్వినియోగంపై రివర్స్‌ ఫ్రంట్‌ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా వ్యర్థాలను పునర్వినియోగంలోకి తెచ్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం సియోల్‌లో వినియోగంలో ఉందని తెలిపారు. సీయోల్‌ నగరం నడిబొడ్డు నుంచి ప్రవహించే చెంగిచియాన్‌ నది హైదరాబాద్‌ మధ్యలో ప్రవహించే మూసీలాగా మురికిమయంగా ఉండేదన్నారు. నదిని సియోల్‌ నగర పాలక సంస్థ ప్రక్షాళనతో అత్యంత సుందర నగరంగా సీయోల్‌ మారిందని చెప్పారు.సీఎం రేవంత్‌రెడ్డి తలపెట్టిన మూసీనది ప్రక్షాళనతో హైదరాబాద్‌ నగరం మరో సియోల్‌గా మారనుందన్నారు. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే పునర్వినియోగం ప్లాంట్లను తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పుతుందని వివరించారు.