‘నేను-కీర్తన’ చిత్ర టీజర్ చూస్తుంటే కొత్త దర్శకుడితో కొత్త నిర్మాణ సంస్థ తీసిన సినిమాగా అనిపించడం లేదని, హీరోగా చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)కి చాలా మంచి భవిష్యత్ ఉందని ”నేను-కీర్తన” ఫస్ట్ లుక్, టీజర్ విడుదల వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టి.ప్రసన్నకుమార్, వీరశంకర్, యాటా సత్యనారాయణ అన్నారు. చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ, చిమటా రమేష్ బాబు, రిషిత, మేఘన హీరో హీరోయిన్లుగా చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రమిది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టీజర్ విడుదల వేడుక ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది. తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్న కుమార్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, ‘రజాకర్’ దర్శకుడు యాటా సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తనే హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించానని, ఈ ఏడాది బ్లాక్ బస్టర్గా నిలిచే చిన్న చిత్రాల జాబితాలో మల్టీ జోనర్ చిత్రంగా తమ చిత్రం కచ్చితంగా చేరుతుందని, కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు, ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిమటా రమేష్ బాబు తెలిపారు. ఈ చిత్రంలో నటించడం చాలా సంతృప్తినిచ్చిందని సీనియర్ నటులు విజరు రంగరాజు, జబర్దస్త్ అప్పారావు పేర్కొన్నారు. ఇందులో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు హీరోయిన్ రిషిత కృతజ్ఞతలు తెలిపారు. సంగీత దర్శకుడు ఎం.ఎల్.రాజా, రాజ్ కుమార్, ఎర్రచీర సుమన్ బాబు తదితరులు పాల్గొని ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.