– సుప్రీంకోర్టులో కేసుండగా ఎలా పిలుస్తారు : సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముందే నిర్ణయించిన కార్యక్రమాలున్నందున సీబీఐ విచారణకు ఇప్పట్లో హాజరు కాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. లిక్కర్ కేసులో విచారణకు ఈ నెల 26న డిల్లీలోని సీబీఐ కార్యాలయాలనికి రావాలని ఇచ్చిన నోటీసులకు స్పందిస్తూ ఆదివారం రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయడం లేదా ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు.. కేసులో ఏవైనా ప్రశ్నలకు సమాధానం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదనీ, 2022 డిసెంబరులో అప్పటి విచారణాధికారి ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో జారీ చేసిన నోటీసుకు ప్రస్తుత నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని అభ్యంతరం చెప్పారు.
41ఏ కింద ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదనీ, నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తున్నదని లేఖలో వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని అన్నారు. ఈ సమయంలో విచారణ పేరిట ఢిల్లీకి పిలవడం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగించనుందనీ, ఇది ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుందని తెలిపారు.
నన్ను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారని ప్రస్తావించారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వం ఇచ్చిన హామీ సీబీఐకి కూడా వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలోనూ సీబీఐ బందం హైదరాబాద్లోని నా నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించాననీ, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానని కవిత పేర్కొన్నారు.