మహేష్ బాబు, నాగార్జున, రవితేజ వంటి ప్రముఖ కథానాయకులతో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ, రాస్ర ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా రూపొందిస్తున్న నూతన చిత్రం ‘ఏ రోజైతే చూశానో నిన్ను’. ఈ చిత్రం ద్వారా ఇద్దరు బాల నటీనటులు నాయకానాయికలు పరిచయం అవ్వడం విశేషం. స్క్రీన్ ప్లే, విజువల్ ఎఫెక్ట్స్లో సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ‘చెక్, బుర్రకథ, రంగ రంగ వైభవంగా’ వంటి సినిమాల్లో చైల్డ్ హీరోగా నటించి మెప్పించిన భరత్ రామ్ హీరోగా పరిచయమవుతున్నారు. అలాగే ‘ఛార్లీ 777, జాగ్వార్’ లాంటి పలు కన్నడ చిత్రాల్లో నటించి, బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య గౌడ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుందని చిత్ర బృదం తెలిపింది.