ఐసీజే ఆదేశాలు బేఖాతరు

ఐసీజే ఆదేశాలు బేఖాతరు– గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ యుద్ధోన్మాదం
వెస్ట్‌బ్యాంక్‌ : ఇజ్రాయెల్‌ యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. పాలస్తీనియన్లపై మారణకాండ తక్షణమే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసినా.. వాటిని ఇజ్రాయెల్‌ ఏమాత్రమూ లెక్క చేయడం లేదు. గాజాలో, ముఖ్యంగా రఫాలో శనివారం కూడా ఇజ్రాయెల్‌ తన యుద్ధోన్మాద దాడులను యథేచ్ఛగా కొనసాగించింది. రఫాకు ఆగేయంగా ఇజ్రాయిల్‌ యుద్ధ ట్యాంక్‌లు, బలగాలతో ఆక్రమణలను కొనసాగిస్తూ అక్కడి అమాయక పౌరులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. నగరంలో జనసాంద్రత ఎక్కువగా వున్న పశ్చిమ జిల్లా ప్రాంతం వైపుగా నెతన్యాహూ సైన్యం చొరబడుతోంది. రఫాలోని కువైట్‌ ఆస్పత్రికి సమీపంలో నివాస భవనాలపై బాంబు దాడులు జరిపింది. ఉత్తర గాజావ్యాప్తంగా కొనసాగుతున్న వైమానిక దాడుల్లో డజన్ల సంఖ్యలో ప్రజలు మరణించారు. బీట్‌ హనూన్‌ ప్రాంతంలో తలదాచుకున్న మహిళలు, చిన్నారులు కూడా మరణించిన వారిలో వున్నారు.
దయనీయస్థితిలో ప్రజలు
ఇజ్రాయెల్‌ వరుస దాడులతో గాజా, రఫా పరిసర ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. తాగడానికి గుక్కెడు నీటి కోసం కూడా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 17 రోజులుగా ఆస్పత్రికి ఇంధనం, నీటి సరఫరా లేదు, వైద్య సరఫరాలు కూడా అందడం లేదు. దాదాపు కుప్పకూలే పరిస్థితిలో వుంది. గాజాలో యుద్ధం మొదలైన తొలినాళ్ళలో వున్న పరిస్థితులే నేడు రఫాలో కనిపిస్తున్నాయి. ఉత్తర గాజాలోని ఒక స్కూలుపై జరిగిన దాడిలో పదిమంది పాలస్తీనియన్లు మరణించారు. 17 మంది గాయపడ్డారు. ఆ పొరుగు ప్రాంతాల నుంచి పారిపోయి వచ్చి ఆ స్కూల్లో చాలామంది తలదాచుకున్నారు. జాబాలియా శరణార్ధ శిబిరంపై కూడా భీకరంగా దాడి జరిగింది. అనేకమంది అక్కడ నుండి పారిపోయారు. వెస్ట్‌ బ్యాంక్‌లో జరుగుతున్న దాడుల్లో 15 మంది పాలీస్తీనియన్లను ఇజ్రాయెల్‌ సైన్యం అపహరించింది. ఇప్పటివరకు 8,855 మందిని ఇలా అదుపులోకి తీసుకున్నారని పాలస్తీనా ప్రిజనర్స్‌ సొసైటీ తెలిపింది. ఇప్పటివరకు గాజాలో 35,857 మంది మరణించగా, 80,293 మంది గాయపడ్డారు. గాజాలో జరుగుతున్న విషాదం మాటలకందనిదని ఐక్యరాజ్య సమితి అత్యవసర సహాయ కార్యకలాపాల చీఫ్‌ వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ దారుణాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు.
తక్షణమే నిధులు విడుదలకు జి7 వినతి
పాలస్తీనా తక్షణ ఆర్థికావసరాలను దృష్టిలో వుంచుకుని విత్‌హెల్డ్‌లో పెట్టిన పాలస్తీనా అథారిటీ నిధులను తక్షణమే విడుదల చేయాలని జి-7 దేశాల ఆర్థిక మంత్రులు శుక్రవారం ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. స్టెరిసాలో సమావేశమైన వీరు గాజాలో పరిస్థితులపై చర్చించారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో కీలకమైన ఆర్థిక లావాదేవీలకు అంతరాయం కలిగించవద్దని వారు కోరారు. పాలస్తీనా బ్యాంకులతో లావాదేవీలను నిలిపివేయడానికి ఇజ్రాయెల్‌్‌ యోచిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వినతి వెలువడింది. ఇజ్రాయిల్‌, పాలస్తీనా బ్యాంకుల మధ్య కొనసాగుతున్న బ్యాంకింగ్‌ సేవలు యథావిధిగా సాగేలా చూడాలని కోరారు.