వ్యాపార వేత్తలను ఇబ్బంది పెట్టినట్టు నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా

– ప్రజలకు పని మనిషి లాగా పని చేస్తా
– కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు
– మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం
నవతెలంగాణ – నకిరేకల్
తాను ఎమ్మెల్యేగా ఉన్నా 2014 -18 మధ్యకాలంలో ఏ వ్యాపార వేత్తను ఇబ్బంది పెట్టినట్లు నిరూపించిన రాజకీయాల నుండి తప్పుకుంటానని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం సవాల్ విసిరారు. శుక్రవారం పట్టణంలోని పన్నాల గూడెం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో గంజాయి సృష్టికర్త బిఆర్ఎస్ అభ్యర్థి కుటుంబమేనన్నారు. ఈ ఎన్నికలలో ఉద్యోగులను కూడా ప్రశాంతంగా ఓటు వేయనీయలేదని పేర్కొన్నారు. బొందల గడ్డను ధ్వంసం చేసిన చరిత్ర బిఆర్ఎస్ అభ్యర్థి దని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి తన నోటికొచ్చిన విధంగా మాట్లాడారన్నారు. ఎవరైనా ఎన్నికలలో తాను చేసిన అభివృద్ధిని, పార్టీ మేనిఫెస్టోను వివరించుకుంటూ ప్రచారం నిర్వహిస్తారు. కానీ బిఆర్ఎస్ అభ్యర్థి తిట్టడమే అజెండాగా పెట్టుకున్నాడన్నారు. సత్యానికి, అసత్యానికి అరాచకానికి, సహనానికి మధ్య జరిగిన ఈ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రెండు మాసాల పాటు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేశారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం బాధపడిన నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఎదిగేలా ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. మీకోసం, ప్రజల కోసం ఒక పనిమనిషి లాగా పని చేస్తానన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లు గెలవబోతున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చెప్పారు. రానున్న ఐదేళ్లలో నకరేకల్ నియోజకవర్గాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దైద రవిందర్, బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మెంబర్ చామల శ్రీనివాస్, నకిరేకల్ యం.పి.పి బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు, చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి నకిరేకంటి ఏసు పాదం, నాయకులు యాస కరుణాకర్ రెడ్డి, లింగాల వెంకన్న, గాజుల సుకన్య, మాద యాదగిరి, కుంచం సోమయ్య, గుత్తా మాధవరెడ్డి, దూదిమెట్ల సత్తయ్య, యానాల లింగారెడ్డి, నాగులంచ వెంకటేశ్వరరావు, గంగాధర పద్మ తదితరులు పాల్గొన్నారు.