– విద్యుత్ అధికారులు, సిబ్బందికి సీఎం హెచ్చరిక
– ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, అవసరమైతే సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్ను ప్రభుత్వం సరఫరా చేస్తోందనీ, ఎక్కడా కోతలను విధించటం లేదని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపేసిన ఘటనలపై ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్పై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంతో పోల్చితే విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ, కోతలు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. సచివాలయంలో గృహజ్యోతి, రూ.500కే గ్యాస్సిలిండర్ పథకాలపై సమీక్షకు ముందు ముఖ్యమంత్రి విద్యుత్ కోతలపై సాగుతున్న ప్రచారంపై అధికారులను ప్రశ్నిం చారు. గతేడాదితో పోల్చితే రెండు నెలల్లో విద్యుత్ సరఫరా ఎక్కువగా చేసినట్టు ట్రాన్స్కో జెన్కో సీఎండీ రిజ్వీ సమాధానమిచ్చారు. ఇటీవల రాష్ట్రంలో మూడు సబ్ స్టేషన్ల పరిధిలో కొంత సేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని వివరించారు. దానికి కారణాలు ఏంటని ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. సబ్స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు సరి చూసు కుంటూ ఉండాలనీ, అలా చూసుకోకపోవడంతో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏవైనా మరమ్మతులు, ఇతర అంశాలకు సరఫరా నిలిపేయాల్సి వస్తే ముందుగానే ఆయా సబ్ స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు సమాచారమివ్వాలని సూచిం చారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ఉద్దేశ పూర్వకంగా కోతలు పెడుతున్నారనే సమాచారం తమకు ఉందని సీఎం వివరించారు. ఎక్కడైనా ఐదు నిమిషాలకు మించి విద్యుత్ సరఫరా నిలిచిపోతే అందుకు గల కారణాలపై వెంటనే సమీక్షించుకోవాలని సూచించారు. సాంకేతిక, ప్రకృతిపరమైన కారణాలు మినహా ఉద్దేశ పూర్వకంగా ఎవరైనా కోతలకు కారణమైతే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిమాండ్కు అనుగుణంగా సరిపడేంత విద్యుత్ను అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని వివరించారు. విద్యుత్ అవసరం ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో సరిపడేంత విద్యుత్ను అందించే కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేశామని తెలిపారు. ఈనెల ఒకటి నుంచి 13వ తేదీ వరకు రోజుకు 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయ్యిందని పేర్కొన్నారు. గతేడాది అదే వ్యవధిలో 242.44 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా జరిగిందని వివరించారు. గతేడాది జనవరిలో 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా కాగా, ఈ ఏడాది జనవరిలో అంతకంటే ఎక్కువగా 243.12 మిలియన్ యూనిట్లు సరఫరా అయ్యిందని తెలిపారు.