చేనేతల వస్త్రాలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు

– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ – జమ్మికుంట
చేనేతల పరిస్థితి చూస్తే మనసు చెలించి పోతుందని హుజురాబాద్  ఎమ్మెల్యేపాడి కౌశిక్ రెడ్డి  అన్నారు. మంగళవారం జమ్మికుంట లోని చేనేత సొసైటీ న ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జమ్మికుంట లోని చేనేత సంబంధించి సొసైటీ పర్యవేక్షణకు వస్తే సుమారు 80 లక్షల స్టాక్ మిగిలి ఉందని, దీంతోపాటు హుజరాబాద్ నియోజకవర్గం లో అన్ని సొసైటీలను కలుపుకొని సుమారు 6 కోట్ల స్టాకు కొనుగోలు చేయకుండా మిగిలి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 కోట్ల వరకు స్టాక్ ఉందని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జిల్లాలోని చేనేత వస్త్రాలు మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికులకు అండగా ఉండి, వారి ఉత్పత్తి చేసిన స్టాక్ మొత్తం కొనుగోలు చేసి, వారి జీవితాల్లో వెలుగు నింపారని తెలిపారు.
చేనేత కార్మికులకు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే, వారి కుటుంబానికి ఐదు లక్షల బీమా కూడా కేసీఆర్ పాలనలో ఇచ్చారని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చేనేత కార్మికులను గాలికి  వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. చేనేత కు సంబంధించిన మంత్రికి కూడా కనీసానికి వారి బాధల పట్ల అవగాహన లేకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. రాజకీయాలను పక్కనపెట్టి వారికి ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు. చేనేతలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జిల్లాలోని చేనేతలంతా కర్రు కాల్చి వాతపెట్టాలని కోరారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు తయారుచేసిన వస్తువులని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు చేనేత సహకార సంఘము చైర్మన్ ఉడుత రమేష్,  బీఆర్ఎస్ పార్టీనాయకులు, కౌన్సిలర్లు  పాల్గొన్నారు.