ట్రైలర్‌తో భ్రమయుగం సంచలనం

ట్రైలర్‌తో భ్రమయుగం సంచలనంవైవిధ్యమైన చిత్రాలతో అలరించే మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో చేరువయ్యారు. ఇప్పుడు ఆయన మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో ‘భూతకాలం’ ఫేమ్‌ రాహుల్‌ సదాశివన్‌ రచన, దర్శకత్వంలో నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, ఎస్‌.శశికాంత్‌ నిర్మించిన మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. హారర్‌-థ్రిల్లర్‌ జోనర్‌ చిత్రాలను నిర్మించడం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌.. వైనాట్‌ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది.
ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకోవడంతో ‘భ్రమయుగం’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్‌ కట్టిపడేసింది. ఈనెల 10న అబుదాబిలో జరిగిన వేడుకలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. చాలా కాలం తర్వాత బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్‌ కొత్త అనుభూతినిచ్చింది. పాచికల ఆట నేపథ్యంలో తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగిన ట్రైలర్‌.. సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.
ఈ కథ కేరళలో మాయ/తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక గాయకుడి జీవితంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మొదట మేకర్స్‌ భావించారు. అయితే మాతక భాషలో చూస్తే ఆ అనుభూతి బాగుంటుండటంతో పాటు, మరింత థ్రిల్‌ చేస్తుందన్న ఉద్దేశంతో ముందుగా మలయాళం భాషలో మాత్రమే విడుదల చేయాలని తాజాగా మేకర్స్‌ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.