సూపర్స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై కంగారు పడుతున్న అభిమానులకు అపోలో హాస్పిటల్ యాజమాన్యం తీపి కబురు తెలిపింది. ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో హాస్పిటల్ రజనీ హెల్త్పై బులిటెన్ విడుదల చేసింది. తీవ్ర కడుపునొప్పి రావడంతో సోమవారం రాత్రి రజనీకాంత్ చెన్నైలోని అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె నాళంలో సమస్య ఉందని గుర్తించి, చికిత్స చేశారు. దీనికి శస్త్ర చికిత్స కానటువంటి ట్రాన్స్కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ చికిత్సను సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయిసతీష్ దగ్గరుండి జరిపించారు. ఆయన రక్తనాళంలో వచ్చిన వాపుకి స్టెంట్ వేసినట్లు తెలిపారు. అలాగే ఎండోవాస్కులర్ రిపేర్ ప్రణాళికా బద్ధంగా సాగిందని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో హాస్పిటల్ నుంచి రజనీని డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. రజినీ క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. తలైవా త్వరగా కోలుకోవాలని అభిమానులంతా ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం ‘వేట్టయాన్’, ‘కూలీ’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘వేట్టయాన్’ ఈనెల 10న విడుదల కానుంది. ఇదిలా ఉంటే, బాలీవుడ్ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయం అయ్యింది. మంగళవారం ఉదయం ప్రమాదవ శాత్తు గన్ పేలి ఆయన మోకాలికి తీవ్ర గాయమైంది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బుల్లెట్ను తొలగిం చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారని గోవిందా మేనేజర్ శశి సిన్హా తెలిపారు. మంగళవారం గోవింద ఇంటి నుంచి కోల్కతాకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. లైసెన్డ్స్ రివాల్వర్ను తీసుకెళ్తుండగా అది చేయి నుంచి జారి కిందపడింది. దీంతో తుపాకీ పేలి కాలిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ‘నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, మీ అందరి ప్రేమ వల్ల నేను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాను. కాలులో బుల్లెట్ తొలగించారు’ అని గోవిందా ఆస్పత్రి నుంచి ఒక వాయిస్ని విడుదల చేశారు.