– మంత్రి తుమ్మలకు తెలంగాణ రైతు సంఘం వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతు సమస్యలపై పొందుపరిచిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం కోరింది. ఈమేరకు శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్రావు, టి. సాగర్, ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్శోభన్ తదితరులు వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలోని కీలకాంశాలివే
భూమాతగా ప్రకటించిన ధరణిలోని లోపాలను సరి చేస్తామన్నారు. ధరణిలో 20 లోపాలున్నట్టు గత మంత్రివర్గ ఉప సంఘం అంగీకరించింది. వాటిని సరిచేసేందుకు మీసేవ ద్వారా ప్రతి రైతు రూ.1650 చెల్లించారు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది డబ్బులు చెల్లించి ధరఖాస్తులు చేసుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి భూసమస్యలపై గల లోపాలను సవరించి అందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలి. సమగ్ర భూ సర్వే నిర్వహించి, గ్రామ సభలు జరిపి లోపాలను సవరించాలి.
రెవెన్యూ రికార్డుల్లో కౌలు రైతుల పేర్లు, వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేయడానికి రెవెన్యూ రిజిస్టర్లో ఓ ‘కాలమ్’ను ఏర్పాటు చేయాలి. అందులో వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేయాలి. 2011 కౌలు చట్టాన్ని అమలు చేయాలి. సాగుదారులందరికి ప్రభుత్వం ప్రకటించిన రూ.12,500 సబ్సిడీ ఇవ్వాలి.
గత రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచి ‘కేంద్ర పీఎం ఫసల్ బీమా’ నుంచి విరమించుకుంది. అప్పటినుండి రాష్ట్ర రైతులకు ఎలాంటి పరిహారం రావడంలేదు.ఏటా రూ.5 కోట్ల పంటలకు నష్టం వాటిల్లుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని రూపొందించి, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల పరిహారం ఇవ్వాలి. ఇందుకు పథకాన్ని రూపొందించాలి.
ప్రాధాన్యత క్రమంలో సాగునీటి పథకాలను పూర్తి చేయాలి. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్ ఉమ్మడి జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టులను రానున్న ఏడాదిలో పూర్తి చేసేందుకు బడ్జెట్ కేటాయింపులు చేయాలి. కాళేశ్వరం సహా భారీ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని ‘హైకోర్టు జడ్జి’ ద్వారా విచారణ జరిపించాలి. నేరస్తులను శిక్షించాలి. సబ్సిడిపై మైక్రోఇరిగేషన్ (డ్రిప్, స్పింక్లర్) పథకాలు అమలు చేయాలి. ఐడీసీ నిర్వహణలోని లిప్ట్ పథకాలను రిపేర్లు చేయాలి.
రాష్ట్రంలో వ్యవస్థీకృతంగా కల్తీ విత్తనాల వ్యాపారం సాగుతుంది. ఏటా నాలుగైదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. కల్తీ విత్తనాలను పట్టుకోవడమే తప్ప నేరస్తులపై ఎలాంటి శిక్షలు లేవు. నష్టపోయిన రైతులకు పరిహారాలు లేవు. ‘వెంటనే ప్రభుత్వం ‘రాష్ట్ర విత్తన చట్టా’న్ని రూపొందించాలి. కల్తీ విత్తన సంస్థల కంపెనీలను రద్దు చేయాలి.
గత రెండేడ్లుగా వ్యవసాయ శాఖ ‘యాక్షన్ప్లాన్’ ప్రకటన లేదు. వెంటనే వార్షిక ప్రణాళికలు ప్రకటించాలి. ఈ వార్షిక ప్రణాళికలో ప్రాంతాల భూసారాన్ని బట్టి పంటల విధానాన్ని రూపొందించాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకం ప్రకారం ఎకరాకు రూ.15,000 చొప్పున రైతుల ఖాతాలో వేయాలి. యాసంగి పంటలకు సంబందించి ఎకరాకు రూ.7,500 చొప్పున వాస్తవ సాగుదారులందరికి వారి ఖాతాలలో జమ చేయాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధరలు, బోనస్ వెంటనే అమలు చేయాలి. వడ్లకు క్వింటాల్ రూ.2683తోసహా మొక్కజొన్న తదితర పంటలకు మ్యానిఫెస్టోలో ప్రకటించిన ధరలను వెంటనే అమలు చేయాలి. అందుకు వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీలకు జీవో విడుదల చేయాలి. లీటర్ పాలకు రూ.5 బోనస్ అమలుకు నిధులు విడుదల చేయాలి. రాష్ట్ర స్థాయి ‘వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమీషన్’ ఏర్పాటు చేసి అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలి.
రూ.2లక్షల లోపు రుణాలు ఏకకాలంలో మాఫీ చేయాలి
రిజర్వు బ్యాంక్ ఆదేశాల ప్రకారం బ్యాంకులు తమ డిపాజిట్లలో 18 శాతం లి’స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలి.
అటవీహక్కుల చట్టం 2006 ప్రకారం అర్హులకు హక్కు పత్రాలు ఇవ్వాలి.
మూసివేసిన చెరుకు ప్యాక్టరీలను తెరిపించుటకు చర్యలు ప్రారంభించాలి.