– అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క అధికారిని వదలం
– భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గురువారం కనగల్ మండలం ధర్వేశ్పురం, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివద్ధి పనుల కోసం ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిస్తే బీజేపీలోకి వెళ్తున్నాడని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రాణం పోయినా బీజేపీలోకి పోనని, ప్రాణం పోయిన తర్వాత తన శవం మీద కూడా కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అడుగులకు మడుగులోత్తుతున్న పోలీసు అధికారులను, ఇతర అధికారులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులలో వదలమని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులపై తమకు గౌరవం ఉందని ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని పనిచేయాలని సూచించారు. లేనిపక్షంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. ఈ దసరా పండుగను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఆ పండుగ రోజు రావణ కాష్టం మాదిరిలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దహనం చేయాలన్నారు. మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఏ స్థాయిలో ఉన్న రాజకీయ జీవితం ప్రసాదించిన నల్లగొండ నియోజకవర్గాన్ని మరువ నున్నారు. 6 గ్యారెంటీ స్కీములను కచ్చితంగా అమలు చేసి తీరుతామని తెలిపారు. ఈనెల 15న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలలో విజయం సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీంల కరపత్రాలను ఎంపీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.