పరువు నష్టం కేసులో…

– రాహుల్‌కు రాంచీ కోర్టు సమన్లు
జంషెడ్‌పూర్‌ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి రాంచీలోని దిగువ కోర్టు సమన్లు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ‘హత్య కేసులో నిందితుడి’గా సంబోధించినందుకు రాహుల్‌పై పరువునష్టం కేసు నమోదైంది. రాంచీ సివిల్‌ కోర్టులో బీజేపీ మద్దతుదారు దాఖలు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో రాహుల్‌కు మంగళవారం సమన్లు జారీ చేశారు. తనపై నమోదైన పరువునష్టం కేసుకు సంబంధించి రాంచీ దిగువ కోర్టులో జరుగుతున్న విచారణను కొట్టివేయాల్సిందిగా రాహుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్‌ హైకోర్టు ఫిబ్రవరిలో తోసిపుచ్చింది. 2018 మార్చి 18న న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో రాహుల్‌ ప్రసంగిస్తూ హత్య కేసులో అమిత్‌ షా నిందితుడని తెలిపారు. దీనిపై బీజేపీ మద్దతుదారు ఝా ఫిర్యాదు చేయడంతో రాహుల్‌పై కేసు నమోదైంది. కాగా సమన్ల తేదీ ఇంకా తెలియలేదని రాహుల్‌ న్యాయవాది చెప్పారు.