– పాలకుల విధానాలను తిప్పికొట్టగలం
– నవ తెలంగాణ సంపాదకులు ఆర్.సుధాభాస్కర్
– ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కార్మిక సంక్షేమంలో రాజీలేని కృషి : శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ – పటాన్చెరు
ఎన్నికల్లో గుణపాఠం ద్వారానే పాలకుల విధానాలను తిప్పికొట్టగలమని నవతెలంగాణ సంపాదకులు ఆర్.సుధాభాస్కర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమలో ఇటీవల జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో హెచ్ఎంఎస్ యూనియన్పై శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) అఖండ మెజార్టీతో విజయం సాధించింది. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలోని పీఎస్ఆర్ గార్డెన్స్లో విజయోత్సవ సభ నిర్వహించారు. శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన జరిగిన సమావేశానికి శాండ్విక్ యూనియన్ మాజీ అధ్యక్షులు, నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్ హాజరై మాట్లాడారు. 39 సంవత్సరాల తర్వాత కూడా అత్యధిక మెజారిటీతో సీఐటీయూను గెలిపించిన శాండ్విక్ కార్మికులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పడం ద్వారా మాత్రమే పాలకుల నిరంకుశ విధానాలను తిప్పికొట్టగలమని చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు. రానున్న అసెంబ్లీ, ఆ తర్వాతి పార్లమెంటు ఎన్నికల్లో పాలకులకు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని కార్మికవర్గానికి, ప్రజానీకానికి పిలుపునిచ్చారు. అనంతరం చుక్క రాములు మాట్లాడుతూ.. ప్రారంభం నుంచీ పరిశ్రమ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కార్మిక సంక్షేమంలో రాజీలేని కృషి చేస్తున్నామని తెలిపారు. కంపెనీలో నూతన కార్మికులు రావాలనే లక్ష్యంతో ఎత్తుగడలను రూపొందించు కొని ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి యూనియన్ కృషి చేస్తోందన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశం కల్పించంలో యూనియన్ విజయం సాధించిందన్నారు. 40 ఏండ్ల నుంచి కార్మికులను ఐక్యంగా ఏకతాటిపై నిలబెడుతూ సీఐటీయూ నాయకత్వం లో కార్మిక సంక్షేమమంటే శాండ్విక్ యూనియన్ను చూసే విధంగా ఆదర్శంగా యూనియన్ను నిలిపా మన్నారు. ఇంతటి చరిత్ర గల మన యూనియన్ను విచ్ఛిన్నం చేయా లనే కుట్రతో కొందరు స్వార్థపరులు పోటీ యూనియన్ పెట్టారని మండిపడ్డారు. శాండ్విక్లో సీఐటీయూకు తప్ప వేరే వారికి చోటులేదనే విషయం గతనెల 19వ తేదీన జరిగిన యూనియన్ ఎన్నికల్లో 106 ఓట్ల అఖండ మెజారిటీతో గెలిపించడం ద్వారా కార్మికులు నిరూపించారన్నారు. ఈ సందర్భంగా కార్మిక సోదరులం దరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
ఓభవిష్యత్తు లో విచ్ఛిన్న కరవాదుల దుష్ప్రచారాన్ని ఎదుర్కొని కార్మికుల ఐక్యతను కాపాడుకోవడం ద్వారా మరిన్ని విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షు లు జె.మల్లికార్జున్, సీఐటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బీరమ్ మల్లేశ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సాయిలు, జిల్లా ఉపాధ్యక్షులు రాజయ్య, జిల్లా నాయ కులు, శాండ్విక్ యూనియన్ నాయకులు, వివిధ పరిశ్రమల యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.