– నారాయణ విద్యార్థికి గోల్డ్మెడల్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో నారాయణ విద్యార్థి మెహుల్ బొరాడ్ గోల్డ్మెడల్ సాధించాడు. భారత్కు చెందిన విద్యార్థులు మూడు స్వర్ణం, రెండు రజత పతకాలను పొందారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ మాట్లాడుతూ మెహుల్ బొరాడ్ నారాయణ కాలేజీ విద్యార్థి కావడం విశేషమని చెప్పారు. ఢిల్లీకి చెందిన ఆదిత్య, పూణేకు చెందిన ధ్రువ్ షాలకు కూడా స్వర్ణ పతకాలు దక్కాయనీ, చండీగఢ్కు చెందిన రాఘవ్ గోయల్, చత్తీస్ఘడ్కు చెందిన రిథమ్ కేరియా రజత పతకాలను సాధించారని వివరించారు. భారత్ నుంచి మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈ పోటీలో పాల్గొంటే, అందరూ పతకాలు సాధించడం విశేషమన్నారు. ఇది గర్వించదగ్గ క్షణమని అన్నారు. మెహుల్ ఆయన తల్లిదండ్రులకు అభినందనలు చెప్పారు. అవిశ్రాంతంగా మద్దతిచ్చిన అధ్యాపకులు, మార్గదర్శకులకు కృతజ్ఞతలు ప్రకటించారు. ఈ సందర్భంగా మెహుల్ బొరాడ్ మాట్లాడుతూ నారాయణ ప్రోగ్రామ్, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఈ ఘనవిజయం సాధ్యమైందని చెప్పారు. ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించానని అన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు.