నందికొండలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మెన్‌పై నెగ్గిన అవిశ్వాసం

నందికొండలో చైర్‌పర్సన్‌,
వైస్‌ చైర్మెన్‌పై నెగ్గిన అవిశ్వాసం– నూతన చైర్మెన్‌ ఎన్నిక లాంఛనమే..
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ నందికొండ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మెన్‌పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ చీలిక వర్గం, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు మొత్తం 9 మంది ఓటేశారు. దీంతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కర్ణ అనూష శరత్‌రెడ్డి, వైస ్‌చైర్మెన్‌్‌ మంద రఘువీర్‌(బిన్నీ) పదవులు కోల్పోయారు. గురువారం మున్సిపల్‌ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించిన ఆర్డీవో చెన్నయ్య ఆధ్వర్యంలో 9వ వార్డు కౌన్సిలర్‌ ఈర్ల రామకృష్ణ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించగా మిగతా ఎనిమిది మంది సభ్యులు ఆమోదించారు. మున్సిపాలిటీలో 11 మంది సభ్యులు ఉండగా.. 9 మంది సభ్యులు ఏకతాటిపై ఉండటంతో చైర్‌పర్సన్‌కు పదవీ గండం తప్పలేదు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మొత్తం 9 మంది మంది కౌన్సిలర్లు చేతులు పైకెత్తడంతో, తీర్మానం నెగ్గిందని ధ్రువీకరించారు. కొత్త చైర్‌పర్సన్‌ ఎన్నికకు తేదీ ప్రకటిస్తామని తెలిపారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందినవారే తదుపరి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది.