అవిశ్వాసం నేపథ్యంలో కాంగ్రెస్‌ విప్‌ జారీ

Navatelangana,Adilabad,Telugu News,Telangana,– కౌన్సిలర్ల ఇంటి గోడలపై అతికించిన నోటీసులు
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
ఆదిలాబాద్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ జహీర్‌ రంజానీపై అవిశ్వాసం నేపథ్యంలో మూడు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కౌన్సిల్‌ సభ్యులు చేజారిపోకుండా ఉండేందుకుగాను వారిని శిబిరాలకు తరలించగా అవిశ్వాసంపై ఎలాగైనా పైచేయి సాధించాలనే దృడ సంకల్పంతో ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఈ నెల 18న బల్దియా కార్యాలయంలో జరగనున్న అవిశ్వాస తీర్మాణ సమావేశానికి తప్పకుండా హాజరై మద్దతు తెలపాలని రాజకీయ పార్టీలు తమ కౌన్సిల్‌ సభ్యులకు విప్‌లు జారీ చేశాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్‌కి సంబంధించి పట్టణ అధ్యక్షుడు గుడిపెల్లి నగేష్‌కు ఈ విప్‌ అధికారం బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించిన కౌన్సిలర్లు బడాల సుజాత, అంబకంటి అశోక్‌, దర్శనాల లక్ష్మణ్‌, రేష్మ, విజరు నివాస గృహాల వద్దకు ఈ విప్‌ నోటీసులు అందించేందుకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో వారి ఇంటిగోడలకు వాటిని అతికించారు. పట్టణంలో మొత్తం 49 వార్డులు ఉండగా బీఆర్‌ఎస్‌ నుంచి 24 మంది, బీజేపీ నుంచి 11 మంది, కాంగ్రెస్‌ నుంచి ఐదుగురు, ఎంఐఎం నుంచి ఐదుగురు, నలుగురు స్వతంత్రులు గెలుపొందారు. అయితే కౌన్సిల్‌ సభ్యులు పార్టీల మార్పుతో సంఖ్యాబలం తారుమారైపోయింది. బీఆర్‌ఎస్‌ ఇదివరకే విప్‌ అస్త్రాన్ని ప్రయోగించగా తాజాగా కాంగ్రెస్‌ సైతం అదేబాటలో పయనిస్తోంది. విచిత్రమేమిటంటే ప్రస్తుతం అవిశ్వాసం ఎదుర్కొంటున్న మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ జహీర్‌ రంజాని సైతం ఇటీవల కాంగ్రెస్‌ గూటికి చేరారు. దాదాపు పది మంది కౌన్సిలర్లు సైతం హస్తం కండువాలు కప్పుకున్నారు. వారంతా ఇప్పుడు క్యాంపులో ఉన్నారు.