పగలు వెలుగులు.. రాత్రులు చీకట్లో .!

The lights of the day.. The nights are in the dark.!– గ్రామాల్లోని సమస్యలను పట్టించుకోని స్పెషల్ ఆఫీసర్లు  
– గ్రామాల సందర్శనలు అంతంతే 
– రాత్రి వేళల్లో భయటకు రావాలంటే జంకుతున్న జనం  
– చిమ్మనీ చీకట్లో బయటకేళ్ళేదెట్ల సార్లు 
– సమస్యలను సెక్రటరీల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోట్లేదని ఆరోపణ 
– ఉన్నతాధికారులకైనా సమస్యలను పరిష్కరించాలని వినతి 
నవతెలంగాణ – దుబ్బాక రూరల్ 
వాళ్ళు పట్టణాలకు దూరంగా ఉన్న పల్లెలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పని చేసే అధికారులు. వారి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను బాధ్యతయుతంగా పరిష్కరించాల్సిన బాధ్యత వారిది  వారే.మరో వైపు గ్రామీణ ప్రాంతాల్లోని ఆ  గ్రామపంచాయతీలకు (పల్లెలకు) బాసులు .2024 (ఇటీవల)లో జరిగిన ఎమ్మెల్యే, ఎంపి ఎన్నికల ముందు గ్రామపంచాయతీల్లోని  సర్పంచుల పదవులు ముగియడంతో అధికారులకే పూర్తిగా గ్రామా పంచాయతీలపాలన బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది.దాదాపు  6 నెలలు కావస్తున్న గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను ప్రత్యేక్షంగా, పరోక్షంగా  వారీ దృష్టికి తీసుకెళ్ళిన  సంబంధిత  గ్రామా పంచాయతీ అధికారులు విధుల్లో  నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఇక స్పెషల్ ఆఫీసర్లు గ్రామాల సందర్శనలు చేయకుండా తమ సమస్యలను ఏం పరిష్కరిస్తారని పలువురు అంటున్నారు.గ్రామాల్లో అధికారులు మాత్రం  కేవలం జిల్లా ఉన్నాతాధికారులు పర్యవేక్షించినప్పుడే  కనిపిస్తున్నారనే విమర్శనలు ముటగట్టుకుంటున్నారు.
ఉమ్మడి దుబ్బాక మండలంలో ఇదే దుస్టితి 
ఉమ్మడి దుబ్బాక మండల పరిధిలో  మొత్తం ౩౦ గ్రామాలు ఉన్నాయి. ఐతే పలు గ్రామాల్లో పగటి వేళల్లో విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి.ఇలా 24 గంటలు వెలుగుతుండటంతో  కరెంట్ బిల్లుల మోత మోగుతుంది.మరోవైపు ఆయా గ్రామపంచాయితీ పరిధిలో ఉన్న అన్ని కాలనీలల్లో రాత్రి వేళల్లో కాలనీ వాసులవసరం కోసం బయటకు వెళ్లేందుకు స్తంబాలపై  బల్బులు అమర్చి, ప్రత్యేకంగా స్విచ్ బోర్డులను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఒక కాలనీ మొత్తానికి రాత్రి వేళ్ళల్లో  బల్బులు వెలగడానికి (విద్యుత్ సరఫరా కోసం ) ఒకే చోట స్విచ్చులను  అమర్చారు. ఐతే గత కొంత కాలంగా విద్యుత్ స్తంబాలకు అమర్చిన బల్బులు నిరంతరం వెలుగుతున్న మరికొన్ని చోట్ల రాత్రి వేళల్లో పని చేయడంలేదు.దీంతో రాత్రి వేళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అంటిముట్టనట్టు వ్యవహారిస్తున్న అధికారులు 
ఈ ఏడాది ఫిబ్రవరి 1 తో సర్పంచులు,వార్డ్ మెంబర్ల  పదవీకాలం ముగిసింది.గ్రామ పంచాయతీ ఎన్నికల గడువు ఉండటంతో గ్రామాల పరిపాలన బాధ్యతలను అధికారులకే అప్పగించారు. ఇక  జిల్లాలోని  ప్రతి మండలానికి  ఓ ప్రత్యేకధికారితో పాటు,ఆయా గ్రామాలకు తహసిల్దార్,ఎంపిడీవో,ఎంపివో,  గ్రామ పంచాయతి సెక్రటరీలను జిల్లా కలెక్టర్,జిల్లా పరిపాలన అధికారులు నియమించిన సంగతీ అందరికీ తెలిసిందే.ఆ తర్వాత ఎమ్మెల్యే , ఎంపీ ఎన్నికలు జరిగాయి.కానీ గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు పేరుక పోయిన సమస్యలపై  ప్రత్యేక ద్రుష్టి సారించడంలేదని వాపోతున్నారు. గ్రామాల్లోని అన్ని వార్డుల్లో అధికారులు తిరిగి ప్రజా సమస్యలు  తెలుసుకుని పరిష్కరించాల్సింది పోగా ఆ సమస్యలను అంటిముట్టనట్టు వ్యవహరించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు గ్రామాలను సందర్శించడంలో అధికారుల పట్టింపు అంతంత మాత్రంగానే ఉండటంతో అధికారుల పని తీరు, వ్యవహర శైలిపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఆరు నెలలకు పైగా అవస్థలు  
సర్పంచుల పాలన ముగియక ముందే గ్రామాల్లో విద్యుత్ స్థంబాలపై ఉన్న బల్బులు సరిగా వెలగడం లేదు.మరోవైపు గ్రామాల్లోని  ప్రధాన రహదారులకు  ఇరువైపులా ఉన్న స్తంభాలు రాత్రి వేళల్లో  వెలగక పోవడంతో చిమ్మనీ చీకట్లోనే భయంతో ప్రజలు  ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆరునెలలకు పైగా అవస్థలు పడుతున్నా తమ బాధను అధికారుల దృష్టికి  తీసుకెళ్లినా పట్టించుకోవడంలో శ్రద్ధ చూపడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థంబాలపై
 విద్యుత్  అంతరాయం ఉన్న వార్డుల్లో ,ప్రధాన కూడళ్లలో గ్రామ సెక్రటరీలు విద్యుత్ అధికారులతో మాట్లాడి  సమస్యను పరిష్కరించడంలో  విఫలమవుతున్నారనే ఆపవాదన  ప్రజల్లో నెలకొంది. ఇక నైనా ఉన్నతాధికారులైన చొరవ తీసుకుంటే తప్ప విద్యుత్ స్థంబాలపై అమర్చి బల్బులు రాత్రి వేళల్లో వెలిగే అవకాశం అభిప్రాయ పడుతున్నారు
అధికారులు కుర్చిలకే పరిమితం: స్వామి చరణ్ మాజీ ఉప సర్పంచ్ 
గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపడం లేదు. సర్పంచుల పాలన ముగిశాక అధికారులు సమస్యలను గుర్తించడంలో విఫలమయ్యారు. గ్రామాల్లో సెక్రటరీలు ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప మిగతా రోజుల్లో గ్రామాలను పూర్తిగా సందర్శించిన దాఖలాలు లేవు. విద్యుత్ సమస్యను దృష్టికి తీసుకెళ్తే తూతూ మంత్రంగా పని చేశారు.పూర్తి స్థాయిలో స్తంభాలకు  బల్బులు వెలిగేలా చూడాలి. స్విచ్ బోర్డులు ,బల్బులు వెలగని చోట అధికారులు మరమ్మత్తులు చేపట్టాలి.
సమస్యను సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే లేరు: డి. కర్ణాకర్  తిమ్మాపూర్            
స్పెషల్ ఆఫీసర్లు పాలన వచ్చాక గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి.అధికారులు గ్రామాలను పూర్తి స్థాయిలో సందర్శించి సమస్యలు తెలుసుకున్న రోజులు లేవు.కేవలం ఉన్నతాధికారులు వస్తే మాత్రమే కనిపిస్తున్నారు. ఒకటో వార్డులో  కరెంట్ పోల్ మీద ఉన్న బల్బులు వెలగడం లేదని సోషల్ మీడియా ద్వారా  సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన కూడా లేదు. అధికారులు ఏ మేరకు పని చేస్తున్నారో తిమ్మాపూర్ ప్రజలకు అర్థమవుతుంది. బాధ్యతాయుతంగా పని చేయాల్సిన అధికారులు ఏం పట్టనట్టు వ్యవహరించడం ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది.
రాత్రి వేళల్లో ఇబ్బందులే: గన్నెబోయిన సతీష్ గౌడ్ 
గ్రామంలోని పలు కాలనీల్లో రాత్రి వేళల్లో విద్యుత్ స్థంబాలపై ఉన్న బల్బులు వెలగడం లేదు. మరోవైపు తిమ్మాపూర్ నుండి  పద్మనాభునిపల్లి వరకు ఉన్న రహదారిపై పక్కన ఉన్న స్థంబాలపై బల్బులు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ఆ దారి గుండా ప్రజలు ప్రయాణించాలంటే భయపడుతున్నారు. సాయంత్రం సమయంలో సిద్దిపేటకు చదువుకునేందుకు వెళ్లిన పిల్లలు రావడానికి కూడా కష్టతరం అవుతుంది.ఒకవైపు తిమ్మాపూర్ ,పద్మనాభునిపల్లి ,అందె వరకు రోడ్డు మరమ్మతులకు నోచుకోవడం లేదంటే ఆ దారి గుండా విద్యుత్ సమస్య వెంటాడుతోంది.వెంటనే  అధికారులు సమస్యను పరిష్కరించాలి.