– నలుగురు ప్రభుత్వా ధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ
– రూ.2.10 కోట్లు స్వాహా చేసిన అధికారులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో నకిలీ ఖాతాలతో కోట్ల రూపాయల గొర్రెల పంపిణీ స్కాంకు పాల్పడ్డ నలుగురు ప్రభుత్వాధి కారులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గురువారం అరెస్టు చేసింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ సి.వి ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం గొర్రెల పెంపకానికి సంబం ధించి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కీమ్ను పశు సంవర్ధక శాఖకు చెందిన కొందరు ప్రభుత్వా ధికారులు దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం తెచ్చినట్టు ఏసీబీ దృష్టికి వచ్చింది. ముఖ్యంగా, గొర్రెల పంపిణీదారులకు సంబంధించి బినామీ పేర్లతో నకిలీ ఖాతాలను తెరిచి పెద్ద మొత్తంలో నిధులను దారి మళ్లించినట్టు గుర్తిం చింది. ఈ విధంగా రూ.2.10 కోట్ల మేరకు నలుగురు అధికారులు కామారెడ్డి ఏరియా వెటర్నరీ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్. ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్. ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి భూగ ర్భజల అధికారి రఘుపతి రెడ్డి, వయో జన విద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేశ్లు స్కాంకు పాల్పడినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా, కొందరు ప్రయివేటు వ్యక్తులను కూడా కలుపుకొని ఈ స్కాంకు వారు పాల్ప డినట్టు కూడా దర్యాప్తులో బయట పడింది. దీంతో పై నలుగురు అధికా రులను అరెస్టు చేసిన ఏసీబీ అధికా రులు, ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చి చంచ ల్గూడ జైలుకు తరలించారు.