– మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏకకాలంలో ఈ నెల 15న తొమ్మిది మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. శుక్రవారం ఆయన ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా జిల్లా కేంద్రాల్లో 20 వేల మందికి తగ్గకుండా భారీ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన కేంద్రం తెలంగాణకు శూన్యహస్తం చూపించిందని విమర్శించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటులో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఎంబీబీఎస్ సీట్ల విషయంలో 2014లో అట్టడుగున ఉన్న తెలంగాణ నేడు ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.